తెలంగాణచౌక్, సెప్టెంబర్ 21: తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకభూమిక పోషించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. గురువారం కరీంనగర్లో జిల్లా పద్మశాలీ సంఘం నిర్వహించిన 11వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి.. మానేరు శివారులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గంగుల మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ మహనీయుడికి సర్కారు సముచిత గౌరవం ఇచ్చిందని చెప్పారు. ఈ దిశగా జలదృశ్యంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయించిందని గుర్తుచేశారు. ఆయన ఏ ఒక్క కులానికో, మతానికి చెందిన వ్యక్తి కాదని.. అందరి వారని శ్లాఘించారు. 90 ఏండ్ల వయస్సులోనూ తెలంగాణ కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.