హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి (శనివారం)ని పురసరించుకుని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణ కోసం తాను బయలుదేరిననాడు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గకుండా బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని ఉద్యమవేదికగా నిలపడం తన తెలంగాణ పోరాట ప్రస్థానంలో మరిచిపోలేనిదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. బాపూజీ ప్రదర్శించిన నికచ్చితనం, నిరాడంబరత లక్ష్య సాధనకోసం కనబరిచిన పట్టుదల తననెంతో ప్రభావితం చేశాయని తెలిపారు. న్యాయవాదిగా, రాజనీతిజ్ఞుడిగా స్వాతంత్రోద్యమకాలం నుంచి రాష్ట్ర సాధన చివరిదశ దాకా బాపూజీ చేసిన కృషిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగిన బీఆర్ఎస్ పదేండ్ల ప్రగతి పాలనలో కొండా లక్ష్మణ్ బాపూజీ అశయాల కొనసాగింపు ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు.