Komuravelli Mallanna | చేర్యాల, జనవరి 5: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాతలు, అధికారులకు ఆహ్వానాలు అందాయి. స్వామివారి క్షేత్రంలో నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కండ్లారా తిలకించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్ట్టువస్ర్తాలు సమర్పిస్తారు. మంత్రి కొండాతోపాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నట్టు ఆలయవర్గాలు వెల్లడించాయి. ఈ కల్యాణ మహోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరయ్యే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు వివరించారు. శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆలయాన్ని సందర్శించి కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రావు తెలిపారు.