హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మునుగోడులో ఎవరు గెలవాలన్నది నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. అవమానాలు భరించలేకనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. నా వ్యాపారానికి, రాజకీయ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.