హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని ఢీ కొడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ను జాతీయ రాజకీయాలవైపు రాకుండా రాష్ర్టానికే పరిమితం చేయడానికి బీజేపీ అగ్రనేత అమిత్షా ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతున్నది.
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పావుగా వాడుకొని.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది చివర్లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. తద్వారా కనీసం నాలుగైదు నెలలు సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయమై నమస్తే తెలంగాణ జూలై 22 వ తేదీ సంచికలో వార్త ప్రచురించింది. ఇవాళ నమస్తే చెప్పినట్టుగానే జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేశారు. ఊహించినట్టుగానే బీజేపీలో చేరనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. రాజగోపాల్ గత నెల 21న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో రహస్యంగా సమావేశమయ్యారు. దీనికి జార్ఖండ్లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారు. ఈ సందర్భంగానే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది.