నీలగిరి : కోమటిరెడ్డి బ్రదర్స్ నిలకడ లేని వ్యక్తులని , అన్నదమ్ములిద్దరూ కోవర్ట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మునుగోడు మండలంలోని గూడపూర్ లో ఇంటింటికి వెళ్లిఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజకీయ స్వార్థం తప్ప ప్రజల సమస్యలు పట్టని రాజగోపాల్ రెడ్డినిఎన్నికల్లో ఓడిస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల అభివృద్ధిని చూస్తే ఆనందం కలుగుతుందని మునుగోడు దీనస్థితిని చూస్తే బాధేస్తుందన్నారు. దీనికి కారణమైన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజల ఉసురు తగులుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అమలు చేస్తున్న పథకాలు గడపగడపకు అందుతున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, హరితహారం మొక్కలతో పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు.
తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తపనతో ఉన్న సీఎం కేసీఆర్ కు మునుగోడు నుంచి బలం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వంగాల సహదేవరెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు జిల్లా శంకర్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు సర్పంచులు భైరవుని ఎంకన్న, అయితగొని యాదయ్య, కడారి కృష్ణయ్య, యాదయ్య దొటి శీను, ఎర్ర మాద వెంకటరెడ్డి, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, మల్లికంటి రాజు, గూడపూర్ సర్పంచి కంచి జ్యోతి, దిందే మల్లేశ్, నన్నూరి భూపతి రెడ్డి, కొంగలి శివ, జంపుల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.