నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు తోడు దొంగలే..ఏనాడు వారికి ప్రజల సంక్షేమం పట్టదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫైర్ అయ్యారు. నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 376 మందికి కోటి ముప్పై రెండు లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 20 వేల కోట్ల బొగ్గు గనుల కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి ఏనాడు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడలేదు. జార్ఖండ్లో 25 సంవత్సరాల పాటు బొగ్గు గనిని లీజ్కు తీసుకొని బీజేపీకి అమ్ముడు పోయిన నీచుడు అని, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాజగోపాల్కి కర్రుకాల్చి వాత పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తక్కువేమీ కాదు. నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి.. నల్లగొండను అధోగతి పాలు జేసిండు. నల్లగొండ పట్టణంలో ఒక్క సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కోమటిరెడ్డి సోదరులకు మించిన వారు లేరని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..గులాబీ జెండాకు ఓటెయ్యడం వల్లనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్లగొండ అభివృద్ధికి నోచుకోలేదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.