హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రైతుబంధు పడలేదని రైతులు అడుగుతున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా ‘రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతుబంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా? అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా? అని నిలదీస్తున్నారు. గ్రామాల్లో రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు. రైతుబంధు పడలేదని చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి రైతులను చెప్పుతో కొట్టాలని చెప్పినట్టేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిరుడు డిసెంబర్ 9వ తేదీన అర్భాటంగా ప్రారంభించిన రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ నెలన్నర రోజులు గడిచినా ఇంకా రెండు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి కూడా పూర్తిగా పంపిణీ చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్లో మంగళవారం కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల గ్యారెంటీల అమలుపై కమిటీ చర్చించింది.
ఈ సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. ముందు ప్రకటించినట్టుగానే 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యబీమాను రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. మిగతా వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎన్నికల హామీలను నిర్ధిష్ట గడువుకు ముందే అమలు చేయడం లేదని విమర్శించడం తొందరపాటు చర్య అన్నారు. లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి రెండు అంశాలను చేర్చాలని సిఫారసులు అందినట్టు ఏఐసీసీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్చక్రవర్తి మీడియాకు తెలిపారు.