నీలగిరి, ఫిబ్రవరి 11: తెలంగాణ జల హక్కుల రక్షణకై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన సభపై రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి నోరు పారేసుకొన్నారు. ఇప్పటికే రైతులను చెప్పుతో కొట్టాలని నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైన ఆయన.. మళ్లీ అదేవిధంగా మాట్లాడారు. నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసిన తరువాతే 13న జరిగే సభకు కేసీఆర్ రావాలని అడ్డదిడ్డంగా పేలారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ రోజునే నల్లగొండ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ ప్రధాన కూడలిలో ఒక కుర్చీ, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెట్టి ఎల్ఈడీ టీవీల్లో అప్పటి కేసీఆర్ ప్రసంగాలను పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు లేదని అన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చింది కేసీఆరేనని ఆరోపించారు.