హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో ఏపీలోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ ఆలిండియా టాపర్గా నిలిచారు. డీవీ సాయి చరణ్ రెడ్డి (38), హైదరాబాద్కు చెందిన పన్నాల సాహితీరెడ్డి, తొగరు సూర్యతేజ వరుసగా 48, 66వ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. యూపీఎస్సీ ఐఎఫ్ఎస్-2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 147 మంది అభ్యర్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కి ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. దీనికి సంబంధించిన పరీక్షలను 2022 నవంబర్ 20 నుంచి 27 వరకు నిర్వహించగా, ఇంటర్వ్యూలను జూన్ 2023లో పూర్తి చేసి తుది ఫలితాలను ప్రకటించింది. మరో 12 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఎంపికైన 147 మంది అభ్యర్థుల్లో 71 మంది తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీఐజీ, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ శిక్షణ ఇచ్చినవారే కావడం గమనార్హం. మహేశ్ భగవత్, ఆయన టీమ్ ఆధ్వర్యంలో పర్సనాలిటీ టెస్టులకు సంబంధించి శిక్షణను తీసుకున్న అనురాధ మిశ్రా మూడో ర్యాంకు దక్కించుకున్నారు. భగవత్ వద్ద శిక్షణ తీసుకున్న 14 మంది టాప్-20లో నిలవడం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు భగవత్ అభినందనలు తెలిపారు. మెంటార్లుగా వ్యవహరించిన ఎంవోఈఎఫ్ ఐజీ రమేశ్ పాండే, తెలంగాణ అడిషనల్ పీసీసీఎఫ్ సునీతా భగవత్, మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఎఫ్ఎస్ శ్రేయస్ శ్రీవాత్సవకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎఫ్ఎస్కి ఎంపికైన తొగరు సూర్యతేజ తండ్రి కరుణాకర్రెడ్డి అదనపు డీపీసీ హోదాలో, అసెంబ్లీలో చీఫ్ మార్షల్గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర అడిషనల్ డీఐజీ, సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ సూర్యతేజను ప్రత్యేకంగా అభినందించారు.
మా నాన్న కరుణాకర్ అదనపు డీసీపీ హోదాలో అసెంబ్లీలో చీఫ్ మార్షల్గా పని చేస్తున్నారు. నేను ఐఐటీ ఇండోర్లో బీటెక్, ఐఐఎం బెంగళూరు నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశా. మా నాన్న నుంచి స్ఫూర్తి పొంది ఐఎఫ్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా.
– తొగరు సూర్యతేజ
ప్రకృతి అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రకృతి పట్ల నాకున్న ప్రేమే నన్ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో చేరేలా చేసింది. పరీక్షకు సొంతంగానే సన్నద్ధమయ్యా. ఆప్షనల్గా జియాలజీ పేపర్కు మాత్రం కోచింగ్ తీసుకున్నా. నా శక్తి మేరకు అటవీ శాఖలో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటా.
– కొల్లూరు వెంకట శ్రీకాంత్
మా కుటుంబం దిల్సుఖ్నగర్లో ఉంటున్నది. నా తల్లిదండ్రులు గురుకులాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి ప్రోత్సాహంతోనే మంచి ర్యాంక్ సాధించా. బిట్స్ – హైదరాబాద్ క్యాంపస్లో బీటెక్ పూర్తి చేశాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఇంజినీర్గా ఎంపికై కొంతకాలం పని చేశాను. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రిపేరవుతున్నా. ఐఎఫ్ఎస్కు ఎంపికైనా.. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం.
– సాహితీరెడ్డి