Telangana | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉనికిని అస్థిరపరిచే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రపరిరక్షణ సమితి పేరుతో పనిచేస్తున్న కొలికపూడి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సమావేశమవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. చంద్రబాబు ఆదేశాల మేరకే తాను రేవంత్రెడ్డిని కలిశానని, రేవంత్రెడ్డికే తమ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తామని కొలికపూడి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని, ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్తున్న కొలికపూడి శ్రీనివాస్తో రేవంత్రెడ్డి భేటీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ను నిలువరించేందుకు.. ఆనాడు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులన్నీ ఇప్పుడు మళ్లీ ఏకమవుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ముసుగు తొడుక్కొని వస్తున్నారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం సాధ్యంకాక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక శక్తుల మద్దతు కోసం అర్రులు చాస్తున్నది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబు.. తన ప్రియశిష్యుడికి సాయం పేరుతో తెలంగాణ రాజకీయాలను అస్థిర పరిచే పరోక్ష కుట్రకు సిద్ధపడినట్టు తాజా పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలుకెళ్లిన చంద్రబాబు ఆరోగ్య సమస్యతో మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం చికిత్స కోసం హైదరాబాద్కు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేది లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. చంద్రబాబు నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. చంద్రబాబు వైద్యం కోసం హైదరాబాద్కు చేరుకున్న మరుసటిరోజే రేవంత్రెడ్డితో శ్రీనివాస్ భేటీ కావడం, కాంగ్రెస్కు ఆంధ్ర పరిరక్షణ సమితి మద్దతు ప్రకటించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నారు.