హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించిందని, ఆమె నిరంతర కృషితోనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన గురువారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చొరవ, ధైర్యం, పట్టుదలకు దేశంలోని మహిళాలోకం నీరాజనాలు పడుతున్నదని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి ప్రజలు బీఆర్ఎస్లోకి వస్తున్నారని తెలిపారు.
అప్రతిహత అభివృద్ధిని అడ్డుకునేందుకు, తమ కార్యకర్తలను మభ్యపెడుతూ కాంగ్రెస్, బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించడం ఖాయమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా తెలంగాణకు కేసీఆర్ సేవలు అవసరమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజలకు చాలా స్పష్టత ఉందని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని.. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.