మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కోడూరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు శాఖ పరిశోధకుడు, ప్లచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు కందూరు చోలుల రాజధాని కోడూరులోని చారిత్రక ఆనవాళ్ళను శనివారం పరిశీలించారు. వరద రాజుల స్వామి దేవాలయం వద్ద గల నాగదేవత శిల్పాలు, సతీ శిల్పాలు, కోట బురుజులు, గుండం ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కోడూరులోని శిల్పాలు కందురు చోలుల కాలానివని తెలిపారు. కోడూరు కందూరు చోళులకు రాజధానిగా ఉండేదాని చెప్పారు. వెయ్యేళ్ల చరిత్ర గల కోడూరులోని శిల్పాలు, కోట బురుజులు, తదితర ఆనవాళ్లపై ఒక పుస్తకం తీసుకురావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీ రాజేశ్వర్ గౌడ్ అన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలను పరిరక్షించుకోవాలని గ్రామ సర్పంచ్ బీ శ్రీకాంత్ గౌడ్కు శివనాగి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నర్సిములు, మన్యంకొండ పాలక మండలి సభ్యులు చిన్నయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణయ్య గౌడ్, వార్డు సభ్యులు రమేష్ గౌడ్, శేఖర్, చిన్న నాగన్న గౌడ్, గ్రామస్తులు రాములు గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.