జోగులాంబ గద్వాల : పోలీసుల కళ్లుగప్పి కృష్ణానది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, విస్తృత ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఈ హెచ్చరికలతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా భావించిన పందెం రాయుళ్లు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షేక్ పల్లి, సాసనూలు గ్రామాల శివారులో ఉన్న రహస్య ప్రదేశంలో కోడి పందాలను నిర్వహించారు.
శుక్రవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా పోటీలు జరగడంతో పందెం రాయుళ్లు శనివారం ఇంకా పెద్ద మొత్తంలో తరలివచ్చి పోటీలలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న పందెం రాయుళ్లు అక్కడి నుండి పరుగులు పెట్టారు.
వందల సంఖ్యలో ఉన్న పందెంరాయుళ్లలో కొంతమందిని అదుపులోకి తీసుకొన్నారు. 100 మోటార్ సైకిళ్ళు, 100 కు పైగా కోడి పుంజులు, భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని కోదండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. మరోవైపు స్థానిక పోలీసులతో కాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం గమనార్హం.