CM KCR | ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జపై
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
భర్తృహరి కార్యసాధకుడికి ఓ రూపమిచ్చి ప్రాణంపోస్తే.. ఆత్మాభిమానమిచ్చి పోరాట స్ఫూర్తి నింపితే ఆ విరాట్ రూపం.. బక్కపలచ కేసీఆర్. ఒంటరిగా అడుగేసిన రోజుల్లోనూ అదే నినాదం. లక్షల జనం నీరాజనం పట్టిన సమయంలోనూ అదే నినాదం.. జై తెలంగాణ!
ఆంధ్ర పాలకుల కుయుక్తులను ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారో, ఢిల్లీ నేతల కుటిల వ్యూహాలను కూడా అంతే నేర్పుగా తిప్పికొట్టారు. స్వప్నించారు. పోరాడారు. తెలంగాణ సాధించారు. నెర్రలుబారి, నోరు తెరుచుకున్న పడావు భూముల గొంతులో.. జల ప్రవాహాల పాయసం పోశారు. అప్పులపాలై తిప్పలు పడుతున్న సేద్యగాడికి ఆత్మబంధువై రైతుబంధు ప్రకటించారు. నెత్తిన బిందెతో, చంకన బిడ్డతో.. మైళ్లకు మైళ్లు నడిచి నడుమునొప్పులు తెచ్చుకుంటున్న చెల్లెమ్మల పాలిట అపర భగీరథుడు. పేదింటి ఆడపిల్ల పెండ్లికి పైసలు సర్దుబాటు చేసే సమయానికి.. పేగు తెంచుకోకుండా పుట్టిన పెద్ద కొడుకు. బిక్కుబిక్కుమంటూ ఓ దిక్కున కూర్చున్న వయోధికులకు ఠంచనుగా పింఛను అందించే వేళ.. ఐదో దిక్కు. రైతుల గుండెల్లో ఇరవైనాలుగు గంటలూ వెలిగే విద్యుత్ బల్బు. ప్రతిపక్షాల పాలిట ముట్టుకుంటే మాడ్చేసే కరెంటు తీగ!
* * *
కేసీఆర్ వ్యక్తిత్వం.. బహుముఖీనం. జీవితం.. తెరిచిన పుస్తకం. నాయకత్వం.. ఉద్యమ పాఠం. పాలన.. కాకతీయుల స్వర్ణయుగం. దార్శనికత.. దిగంతాలకు పాకిన అభివృద్ధి కథ. సంక్షేమ పథకాలు.. సకల జనులకు వరాలు.
దటీజ్.. కేసీఆర్!
కేసీఆర్ వ్యక్తిత్వానికి వేల పుస్తకాలు మెరుగులు దిద్దితే.. నాయకత్వాన్ని లక్షల జీవితాలు తీర్చిదిద్దాయి. అలుపు తెలియని చదువరి ఆయన. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు కరతలామలకాలు. హృద్యమైన గద్యాన్ని ఎంత ఇష్టపడతారో, భావగంభీరమైన పద్యాన్నీ అంతే ప్రేమిస్తారు. పదాల పోహళింపును మెచ్చుకుంటారు. కొసమెరుపులకు మురిసిపోతారు. పెద్దన శైలికి పెద్ద అభిమాని. ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఘరీ..’ అంటూ మనుచరిత్రను మక్కువతో ఒళ్లోకి తీసుకుంటారు. పోతన పేరు చెప్పగానే చేతులు ముకుళితం అవుతాయి. ‘బాల రసాల సాల నవ పల్లవ..’ పద్యం గొంతుకలో పల్లవిస్తుంది. కాళన్న కవిత ఆ నోట కాళేశ్వర ప్రవాహమే. కోటి రతనాల వీణ కవి దాశరథిని శతకోటి సందర్భాల్లో స్మరించుకొని ఉంటారు. అనువాద సాహిత్యంలో రాహుల్ సాంకృత్యాయన్ ‘ఓల్గా నుంచి గంగకు’ నచ్చిన పుస్తకాల్లో ఒకటి. పత్రికా పఠనానికి కూడా కేసీఆర్ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దినపత్రికల కట్టలు ముందేసుకుని కూర్చోవడంతో దినచర్య మొదలవుతుంది. మంచి వార్తలను గుర్తిస్తారు. లోతైన విశ్లేషణలను మెచ్చుకుంటారు. సమస్యల ప్రస్తావన ఉంటే తప్పక స్పందిస్తారు. బాధితులకు న్యాయం చేస్తారు. పీడితులకు భరోసా ఇస్తారు.
కేసీఆర్కు మనుషుల్ని ఓ పుస్తకంలా ఆమూలాగ్రం చదవడమూ తెలుసు. ఆయన దృష్టిలో సమాజమే ఓ పెద్ద ‘హ్యూమన్ లైబ్రరీ’. ముఖేముఖే సరస్వతి.. అన్నట్టు ప్రతి మనిషి నుంచీ తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని నమ్ముతారు. ఆయన గొప్ప శ్రోత. ఎదురుగా ఉన్నది మేధావి కావచ్చు. మట్టిమనిషి కావచ్చు. మాట్లాడినంతసేపూ మాట్లాడనిస్తారు. చెవులప్పగించి వింటారు.. నిత్య విద్యార్థిలా, నిరంతర జిజ్ఞాసిలా. ‘కేసీఆర్ నా గురించి తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత.. మిమ్మల్ని కలుసుకోవచ్చా అంటే.. రమ్మని ఆహ్వానించాను. ఒకరోజు కలిసినం. డే అంతా కూర్చున్నం. ఆయన అడుగుడు. నేను జెప్పుడు. నేను ఇంప్రెస్ అయ్యింది ఏందంటే.. ఆయన లోతుకుబోయి అడిగేది. చాలా ఇంప్రెస్ అయిన. విషయ అవగాహన ఉంటేనే ఆ క్వశ్చన్స్ వస్తయ్’ అంటూ కేసీఆర్లోని వినేగుణాన్ని ఓ సందర్భంలో మెచ్చుకున్నారు జయశంకర్ సార్. ఏ మీటింగ్కో వెళ్తున్నప్పుడు.. తనను పలకరించేవారు, తానే పలకరించి మాట్లాడమని ప్రోత్సహించేవారు, అది కేసీఆర్ వాహనమని గుర్తుపట్టి చేతులూపి, కారాపి గోడెళ్లబోసుకునేవారు.. ప్రతి గొంతుకా ఒక పేజీ. ప్రతి ప్రయాణం ఒక పుస్తకం. ఉత్తమ గ్రంథాలు.. మూసేసిన తర్వాత కూడా వదిలి పెట్టవు. సుఖంగా నిద్రపోనివ్వవు. స్థిమితంగా ఉండనివ్వవు. కేసీఆర్తో ములాఖత్లూ అంతే. ఆయన ఏదో తండాలో పల్లె నిద్రకు వెళ్లినప్పుడు అనుకోని సంఘటన జరిగింది. ఒక గిరిజనుడి ఇల్లు అగ్ని ప్రమాదానికి బూడిదైంది. దాంతోపాటే కష్టార్జితమైన సొమ్మూ కాలిపోయింది. ఆ ఇల్లాలి ఏడుపులు ఆయనను ఉద్వేగానికి గురిచేశాయి. అప్పుడే, మనసులో ‘కల్యాణ లక్ష్మి’కి బీజం పడింది. దుబ్బాకలో చదువుకునే రోజుల్లో అతిదగ్గర నుంచీ గమనించిన బీడీ కార్మికుల బతుకులు.. ఆ వెతలను తీర్చాలన్న సంకల్పాన్ని ప్రసాదించాయి. పెన్షన్ స్కీమ్కు పునాది వేశాయి. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ప్రతి పథకానికీ ఓ బలమైన నేపథ్యం ఉంది. కేసీఆర్ జీవితానుభవాలతో అది ముడిపడి ఉంది. ఆయన అంతర్మథనంలోంచి పుట్టుకొచ్చి ఉంటుంది.
దటీజ్.. కేసీఆర్!
‘బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్’.. పద్యంలో పోతనామాత్యుడు ‘సత్కవుల్ హాలికులైన నేమి?’ అంటాడు. ఆమాటకొస్తే.. ‘సత్పాలకుల్ హాలికులైన నేమి?’. అవును. రైతే రాజు..అని మురిసిపోతాం కానీ, నిన్నమొన్నటి వరకు రైతు పేదరికానికి కట్టుబానిస. ఉరితాళ్లకు తలవంచే అసమర్థుడు. గంజి నీళ్లకు గతిలేక.. పురుగుల మందును ఆశ్రయించే అల్పాయుష్కుడు. నష్టాల, కష్టాల జ్యేష్ఠలక్ష్మీ పుత్రుడు. చంద్ర
శేఖర రావు అనే రైతు రాజైన తర్వాతే అతని జాతకం మారింది. ఇరవై నాలుగు గంటలూ కరెంటు అందుతున్నది. సాగునీటి రంగం బాగుపడింది. మూడు పంటలు పండుతున్నాయి. భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. బోరు వేయగానే జోరుగా నీళ్లొస్తున్నాయి. రైతుబంధు పుణ్యమాని బారువడ్డీల బాదుడు లేకుండా పోయింది. ఈ పథకాలన్నీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మొలకెత్తిన ఆలోచనల విత్తులే. వాటికి అంతర్మథనాల పాదులు చేసి, నిధుల నీళ్లు పోసి, చట్టాల కంచెలేసి.. పెంచి పోషించారు కేసీఆర్. అక్కడి మడికట్లు, గట్లు, చెట్లు .. ఆ అవిశ్రాంత పాలకుడికి కించిత్ విశ్రాంతినిస్తాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రతిసారీ.. బుజ్జి మనవళ్లూ మనవరాళ్లలా చేతులూపుతూ స్వాగతం పలుకుతాయి. కేసీఆర్ నాయకుడిగా కంటే రైతుగానే సీనియర్. రైతు కుటుంబంలో పుట్టారు. పొలాల మధ్య పెరిగారు. సేద్యం చేశారు. ఓ దశలో తీవ్రమైన కూలీల కొరత. కారుమేఘాలు కమ్ముకొస్తున్న పరిస్థితి. వీలైనంత వేగంగా కోతలు జరిగిపోవాలి. లేకపోతే తీవ్ర నష్టం తప్పదు. ఆ సమయంలో కేసీఆర్.. సమష్టి సేద్యాన్ని పరిచయం చేశారు. కూలీల కోసం ఆధారపడకుండా.. అందరూ కలిసి, అందరి పొలాల్లో కోతలకు వెళ్తే రెండుమూడు రోజుల్లో ఒడ్డున పడతామని సలహా ఇచ్చారు. అంతా అంగీకరించారు. మూకుమ్మడిగా ఓ గండం గట్టెక్కారు. హాలికుడైన నాయకుడికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికీ అంతే. వ్యవసాయ క్షేత్రానికి, ప్రజా క్షేత్రానికి సమ ప్రాధాన్యం ఇస్తారాయన.
దటీజ్.. కేసీఆర్!
అనర్గళంగా ఆంగ్లంలో సంభాషించగలరు. ముషాయిరా కవులు సైతం ముక్కున వేలేసుకునేలా ఉర్దూలో మాట్లాడగలరు. ఇక, తెలుగు భాష ఉగ్గుపాలతోనే అబ్బింది. నన్నయ నుంచి నారాయణరెడ్డి వరకు తెలియని కవి లేరు. చదవని రచన లేదు. కానీ, సామాన్యులతో సంభాషిస్తున్నప్పుడు, వేదికల మీద ఉపన్యసిస్తున్నప్పుడు అచ్చమైన మట్టిభాషనే ఎంచుకుంటారు. రచ్చబండ మీద పెద్దమనిషి ముచ్చట్లు పెట్టినట్టే ఉంటుంది. ప్రతి మాట వెనుకా ఓ సామెత, పిట్టకథ. కాబట్టే, ఆన్లైన్లో ఆ వీడియోలు అంత వేగంగా వైరల్ అవుతాయి. దెబ్బకు ప్రతిపక్షాలకు వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది. జనం భాషలో మాట్లాడుతూ జనంతో మమేకం అవుతారు. అందుకే, గ్రామీణులు ఆయనను పెద్దన్నలానో, పెద్ద కొడుకులానో చూస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరెంటు కోతలకు నిరసనగా కేసీఆర్ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తానూ రోడ్డెక్కారు. తండోపతండాలుగా జనం వచ్చారు. అందులోనూ మహిళలే ఎక్కువ. ఓ పెద్దమ్మ అయితే కేసీఆర్ భుజం మీద చెయ్యేసి ‘ఇగ అటే పోతవా? కనబడుడే లేదు. ఇటాంకల వచ్చుడే కరువైంది. మా గోసెవలు సూడాలె’ అంటూ ఆత్మీయంగా పలకరించింది. ఆ దృశ్యాన్ని చూసి ‘ఒక రాజకీయ నాయకుడితో ప్రజలు ఇంతగా మమేకం కావడమా?’ అని ఆశ్చర్యపోయారట జయశంకర్ సార్.
ప్రగతి భవన్ కావచ్చు, ప్రచార వాహనం కావచ్చు. భోజన సమయానికి ఎవరున్నా.. పక్కన కూర్చోబెట్టుకోవాల్సిందే. కొసరి కొసరి వడ్డించాల్సిందే. ఏ కూరలో ఏ పచ్చడి నంజుకోవాలో చెప్పిచెప్పి తినిపించాల్సిందే. ‘అన్నపూర్ణకు నుద్దియౌ అతని ఇల్లాలు’ అన్నట్టు అతిథి సేవలో నాలుగక్షరాలు ఎక్కువే చదివిన దొడ్డ ఇల్లాలు శోభమ్మ. ఫామ్ హౌస్లో అయితే.. ప్రతి చెట్టూ ఆయనకు ఎరుకే. ప్రతి పశువుతోనూ ఆయనకు స్నేహమే. వ్యవసాయ కూలీలు, పక్క పొలాల రైతులను పేరు పెట్టి పిలుస్తారు. మంచి చెడ్డలు మాట్లాడతారు. ఇరుగుపొరుగు పొలాలు సందర్శిస్తారు. రైతులతో ముచ్చట్లు పెడతారు. ఆ సమయానికి ఆయన అచ్చమైన మట్టిమనిషి. సామాన్య రైతు.
దటీజ్.. కేసీఆర్!
నాయకుడు దీర్ఘదర్శి కావాలి. మూడు తరాల ముందుకెళ్లి ఆలోచించాలి. బహుళ అంతస్తుల భవనాలు, కాంక్రీట్ కట్టడాలే అభివృద్ధి కాదు. చెరువుల్ని కాపాడుకోవాలి. అడవుల్ని నిలబెట్టుకోవాలి. పచ్చదనాన్ని రక్షించాలి. ఈ దీర్ఘకాలిక దృక్కోణం కేసీఆర్ లాంటి అతికొద్దిమంది నాయకులకే ఉంటుంది. కాబట్టే, రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణలో పచ్చదనం పెరిగింది. ‘సమ్ పీపుల్ ఫీల్ ద రెయిన్. అదర్స్ జస్ట్ గెట్ వెట్’ అంటారు బాబ్ మార్లీ అనే రచయిత. కొందరు వర్షంలో తడుస్తారు. మరికొందరు వర్షాన్ని ఆస్వాదిస్తారు. కొందరికి చెట్టు చెట్టులానే కనిపిస్తుంది. అరుదైన వ్యక్తులకు అందులో భవిష్యత్తు గోచరిస్తుంది. పాత పాలకులకు ఆ హరిత దృష్టి లేకపోవడం వల్లే.. ఢిల్లీ నగరం నరకకూపంలా మారింది. జీవం నిలబెట్టాల్సిన ప్రాణవాయువు.. ప్రాణాంతకమైన కాలుష్యాన్ని పంచుతున్నది. ఆ దుస్థితి మనవరకూ రాకూడదన్న ఆరాటమే హరిత హారానికి జీవం పోసింది. అడవి నగరానికి కూడా విస్తరించాలన్నది ఆయన సంకల్పం. పల్లెలో బడి, గుడితోపాటు నర్సరీ కనిపించాలంటారు. దాదాపు పందొమ్మిదేండ్ల క్రితమే సిద్దిపేటలో పది నిమిషాల్లో పదివేల మొక్కలు నాటించి రికార్డు సృష్టించారు. ‘ఈ అడవి ఎవరిదో కాదు. మనది. చిన్నప్పుడు రకరకాల పండ్ల చెట్లు ఉండె. మనం తినే పండ్లు వేరే ఉంటయి. కోతులు, ఇతర పక్షులు తినేవి వేరే ఉంటయి. కోతులు ఆడనే తినేవి. ఏర్ల నీళ్లు తాగి మంచిగ బతికేవి. అవన్నీ మనం నాశనం చేసినం. అవి వచ్చి మన పంటల్ని నాశనం చేస్తున్నయి’ అంటూ ఇప్పటికే మొదలైన అపసవ్య ధోరణి గురించి హెచ్చరిస్తారు. జీవ వైవిధ్యం గురించి చెబుతూ ‘పర్యావరణ సమతుల్యత లేకపోతే మనిషి జీవించే పరిస్థితే ఉండదు. మన వరకూ ఫర్వాలేదు. ముందుతరాలు మాత్రం చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. పచ్చదనమే దీనికి పరిష్కారం’ అని హితవు చెబుతారు. సమాజంలో రెండురకాల నాయకులు ఉంటారు. ధనాన్ని ప్రేమించేవారు, పచ్చదనాన్ని ప్రేమించేవారు. మన సీఎం రెండో కోవలోకి వస్తారు.
దటీజ్.. కేసీఆర్!
నాయకుడు ఆధ్యాత్మికవేత్త అయినప్పుడు.. పాలన ధర్మ సంస్థాపనలా సాగుతుంది. ‘నాయకత్వ విధానాలలో అత్యుత్తమమైంది ఆధ్యాత్మిక నాయకత్వం’ అంటారు ‘స్పిరిచ్యువల్ లీడర్షిప్’ పుస్తక రచయిత ఓస్వాల్డ్ జె. సాండర్స్. నాయకత్వానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు వచ్చాయి. అవన్నీ అధికారం, కేంద్రీకరణ, వికేంద్రీకరణ, బడ్జెట్, వ్యూహాలు తదితర అంశాలను చర్చించాయే కానీ, పాలకుడికి పాలితులకు మధ్య సంబంధాన్ని ప్రస్తావించలేదు. ఆధ్యాత్మిక పాలకుడు బాధ్యతలో తండ్రి, పోషణలో తల్లి, మంచిచెడులు విప్పి చెప్పడంలో గురువు, సాయపడటంలో తోబుట్టువు, మంచిని కోరడంలో స్నేహితుడు. అధికారం తనది కాదనుకుంటాడు. అంతిమంగా ప్రజలే పాలకులని విశ్వసిస్తాడు. రాజ్య పరిధిలోని జల సంపదకు, ఖనిజ సంపదకు, ఖజానాకు అచ్చమైన ధర్మకర్తలా వ్యవహరిస్తాడు. కేసీఆర్ది కూడా నూటికి నూరుశాతం ఆధ్యాత్మిక నాయకత్వమే. కాబట్టే, బొడ్డూడని బిడ్డలాంటి తెలంగాణకు ఏం అవసరమన్నది అర్థం చేసుకున్నారు. ఆ తపనలోంచి పుట్టుకొచ్చిన పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యయనాలకు ముడిసరుకు అవుతున్నాయి. ఢిల్లీ పాలకులు వెనక బెంచీ మొద్దబ్బాయిలా వాటిని మక్కికి మక్కీ కాపీ కొడుతున్నారు. నాయకుడు తండ్రిలా, తల్లిలా ఆలోచించినప్పుడే ఇదంతా సాధ్యం. కేసీఆర్ రాజకీయాన్ని మతంతో ముడిపెట్టరు, ధర్మంతో అనుసంధానిస్తారు. రాజశ్యామల అయినా, అయుత చండీయాగమైనా.. సర్వజనుల శ్రేయస్సు కోసమే. ‘ప్రతి మతంలోనూ వెలుగుచీకట్లు ఉంటాయి. దేన్ని ఎంచుకుంటామన్నది మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది’ అంటారాయన. వైష్ణవాన్ని పాటించే కుటుంబం నుంచి వచ్చినా.. శివతత్వాన్నీ నరనరానా జీర్ణించుకున్నారు. కొత్త జిల్లాలకు భద్రాద్రి, రాజన్న, జోగులాంబ అని పేర్లు పెట్టారు. బ్యారేజీలకు, పంప్హౌస్లకు అన్నపూర్ణ, పార్వతి, సరస్వతి, సీతారామ, గాయత్రి, లక్ష్మి అని నామకరణం చేశారు. జానపదుల దేవతలు కొండపోచమ్మ, సమ్మక్క, సారక్కలనూ విస్మరించలేదు. యాదాద్రి పునర్నిర్మాణం ఓ చారిత్రక సందర్భం.
దటీజ్.. కేసీఆర్!
అవును. ఆయన వ్యూహకర్తే. ఆ వ్యూహాలు ఎన్నికలకే పరిమితం. అవును. ఆయన కాకలుతీరిన పొలిటీషియనే. రాజకీయాల కాలవ్యవధి నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకే. ఆ తర్వాత.. పార్టీలకు అతీతుడు. ప్రత్యర్థులకూ ఆత్మీయుడే. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మజిలీలు. ఎంతోమంది ఆత్మీయులు. అపారమైన పరిచయాలు. అందరి పేర్లూ ఆయనకు గుర్తుంటాయి. ఎక్కడ కనిపించినా తానే ముందుగా పలకరిస్తారు. కరచాలనం చేస్తారు. హత్తుకుంటారు. అడగకుండానే అవసరాలను గ్రహిస్తారు. చేయగలిగినంత సాయం చేస్తారు. ఓ సందర్భంలో ఏదో సమాచారం కోసం తన ఉద్యమ సహచరుడిని ప్రగతి భవన్కు పిలించారు కేసీఆర్. అప్పటికే ఆయనకు ప్రభుత్వంలో ఓ మంచి బాధ్యతే అప్పగించారు. కానీ ఎందుకో అతను పరధ్యానంగా ఉన్నట్టు అనిపించింది. ‘ఏమైనా సమస్యా?’ అని అడిగారు. ‘మొన్న సిటీబస్లో వస్తుంటే.. ఎవరో పర్సు కొట్టేశారు. పదివేల రూపాయలున్నాయి. చిన్న మొత్తం కాదు కదా. మిడిల్ క్లాస్ జీవితాలు’ అని బాధగా చెప్పారాయన. ఆ సన్నిహితుడు అటు వెళ్లగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ‘ఫలానా వ్యక్తిని ఉన్నతాధికారులతో సమానంగా చూడండి. వాహన సౌకర్యం, జీతభత్యాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి’ అని ఆదేశించారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ వ్యక్తి సిటీ బస్సు ఎక్కలేదు. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి క్యాన్సర్తో బాధపడుతూ తన దగ్గరికి వచ్చినప్పుడైతే, తన ఆత్మీయుడికి వచ్చిన కష్టానికి విలవిలలాడిపోయారు. అమెరికా పంపి, ఆధునిక చికిత్స చేయించారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న సమయం. ఓ రోజు కేసీఆర్ ఇంట్లోంచి బయటికి వస్తున్నారు. ఎదురుగా ఓ ముస్లిం మహిళ నిలబడి ఉంది. దగ్గరికి పిలిచి పలకరించారు. తన కూతురికి ఎంబీబీఎస్లో సీటు వచ్చిందనీ, కానీ ఫీజు కట్టేంత స్తోమత తనకు లేదని ఏడుస్తూ చెప్పింది. ఉద్యమనేత మనసు ద్రవించింది. చాలామందికి ఫోన్లు చేశారు. మొత్తానికి కొంత డబ్బు పోగైంది. తానూ కొంత జోడించి ఆమెకు ఇచ్చి పంపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎలాంటి ప్రచారమూ లేకుండా ఎంతోమందికి సాయం చేశారు. పినతల్లి చేతిలో నరకయాతన అనుభవిస్తున్న ఓ బాలికను దత్తత తీసుకుని, జీవితంలో స్థిరపడిన తర్వాత ఘనంగా పెళ్లి చేశారు.
దటీజ్.. కేసీఆర్!
* * *
‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున్న లక్ష్యాలేమైన ఉన్నయా? ఆ లక్ష్యం దిశగా మనం అడుగు బెడ్తున్నమా? సమస్య నుంచి పారిపోవద్దు. వియ్ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లమ్’ అంటారు కేసీఆర్. నిజమే. ఆయనేం గాంధీ – నెహ్రూ కుటుంబంలో పుట్టలేదు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన అసామాన్య నేత. జనం గుండెచప్పుడు తెలిసిన ఉద్యమకారుడు. ఎన్నికల రాజకీయాలతో ప్రజల కల నిజం చేయవచ్చని గ్రహించిన ప్రజాస్వామ్య వాది. ఒకరిలా నాయనమ్మ, జేజమ్మ పేరు చెప్పుకోరు. జై తెలంగాణ నినాదం మాత్రమే చేస్తారు. మరొకరిలా జనాన్ని విభజించి దేశాన్ని పాలించాలని అనుకోరు. ఉద్యమం కోసం సబ్బండ వర్గాలను సమైక్యం చేసిన చరిత్ర ఆయనది. మనకిప్పుడు కావాల్సింది.. పార్టీలు మారే నాయకులో.. నాయకులను మార్చే పార్టీలో కాదు. బలమైన పాలకుడు. మడమతిప్పని యోధుడు.‘గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే పాలొస్తయా?’ తెలంగాణ నిలవాలంటే.. కేసీఆర్ గెలవాలంతే!
ఓట్ ఫర్ సార్. ఓట్ ఫర్ కార్.
వృద్ధాప్య పెన్షన్
వృద్ధులకు ఇచ్చే జీవన భృతి అర్థవంతంగా ఉండాలి. మనం ఇచ్చే పెన్షన్ కనీసం రెండు పూటలు వాళ్లు తినడానికి అక్కరకు రావాలి. మొదట్ల రూ.1,016 ఇచ్చుకున్నం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడ్డాక రెండువేలకు పెంచుకున్నం. ‘బిడ్డా మా కొడుకులు చూడకపోతే మా బతుకులు ఆగమైతుండే! రూ.2,016 పింఛన్ వస్తుంది. మంచిగ బతుకున్నం బిడ్డ. ఎవరికి మోతాదు లేకుండ ఉన్నం’ అని చాలామంది ఇప్పుడు చెబుతున్నారు.
ఒంటరి మహిళకు పెన్షన్
తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేయాలని ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకోసంపరిపాలనలో అణువణువూ మానవీయ కోణం ఆవిష్కరిస్తున్నది. మ్యానిఫెస్టోలో ప్రకటించకున్నా మానవీయ కోణంలో ఆలోచించి ఒంటరి మహిళలకు అండగా ఉండాలని నిర్ణయించింది. పేదరికం పురుషుల కన్నా, మహిళలను అధికంగా వేధిస్తుంది. నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్ అందించి ఆదుకున్నాం.
రైతుబీమా
రైతుబంధు పథకం సామాన్యమైనది కాదు. భారతదేశ రైతాంగ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నం. యావత్తు దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నది. 12,000 కోట్ల రూపాయలు బాజాప్తగా బడ్జెట్లో కేటాయించి శాసనసభలో బిల్లు పాసు చేయించి సగర్వంగా నేడు రైతుల చేతుల్లో పెడ్తున్నం.
నర్సరీలు
గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు రూ.5 లక్షలు నిధులు సహా గ్రీన్బడ్జెట్ కింద పంచాయతీ నిధుల్లో పది శాతం, నరేగా నిధులు అందుబాటులో ఉన్నాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రతీ పల్లె పచ్చదనంతో అలరారుతున్నది. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పచ్చదనమే మన భవిష్యత్తు అని గ్రహించాలి.
మెడికల్ కాలేజీలు
గతంలో.. ఆంధ్ర నాయకుల పాలనతో తెలంగాణ చాలా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వ రంగంలో ఐదంటే ఐదే మెడికల్ కాలేజీలు ఉండే! కేంద్రం వివక్ష చూపించి ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయకున్నా.. మనకు శక్తి ఉంది కాబట్టి జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 జిల్లాల్లో మనమే కట్టుకుంటున్నం. ఆ మాత్రం సహకరించని బీజేపీకి మనం ఎందుకు ఓట్లు వేయాలే?
వరి ఉత్పత్తి
రాష్ట్రంలో పంట ఇసుక పండినట్టు పండుతున్నది. ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులతో పంజాబ్ను దాటిపోయింది. త్వరలోనే 4 కోట్ల టన్నులకు పెరగనుంది. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొని, ఐదారు రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే! నాడు తెలంగాణలో 7 లక్షల టన్నులు వినియోగమయ్యే యూరియా ఇప్పుడు 28 లక్షల టన్నులకు పెరిగింది.
టీఎస్ ఐపాస్
గతంలో పారిశ్రామికంగా తెలంగాణలో ఒక వెలితి ఉండేది. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు రైళ్లు తయారు చేసే రోజులు వచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్-ఐపాస్ తీసుకొచ్చినం. ఇది దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దాదాపు ఎనభై దేశాల పారిశ్రామిక విధానాలను పరిశీలించి టీఎస్- ఐపాస్కు రూపకల్పన చేశాం. ఫలితంగా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్నది.