ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 3: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా శనివారం ఓ మహిళకు మోకీలు మార్పిడి చేశారు. ఖమ్మం నగరంలోని పంపింగ్వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన జీ బేబీ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నది. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి వైద్యం చేయించుకొనే స్థోమత లేక ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వెళ్లింది. స్థానిక వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసి, మోకీలు మార్చాలని నిర్ణయించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు సారథ్యంలోని వైద్య బృందం శనివారం ఆమెకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నది.