సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన అల్లోల దివ్యారెడ్డి
హైదరాబాద్, మార్చి 13 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను క్లిమామ్ గోశాల వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ ఎస్సార్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి జస్టిస్ రమణ దంపతులకు క్లిమామ్ ఉత్పత్తులను అందజేశారు. దేశవాళీ ఆవులను సంరక్షించడం, చిన్న పిల్లలకు స్వచ్ఛమైన ఏ2 మిల్క్ను అందించడమే లక్ష్యంగా తాము 2015లో క్లిమోమ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్ను స్థాపించినట్టు ఆమె జస్టిస్ రమణకు వివరించారు. ఆవులను జాతీయ సంపదగా గుర్తించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆమె ఈ సందర్భంగా జస్టిస్ రమణను కోరారు. దేశవాళీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి వెన్నెముక లాంటివని పేర్కొన్నారు.
మల్లన్న సన్నిధిలో సీజేఐ
శ్రీశైలం/నాగర్కర్నూల్/అచ్చంపేట/మార్చి 13: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకొన్నారు. ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకొన్న వీరికి లవన్న, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సీజేఐగా బాధ్యతలు తర్వాత రెండోసారి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ కూడా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకొన్నారు. అంతకుముందు వారు శ్రీశైలం వెళ్తూ నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్ హరితహోటల్లో కొద్దిసేపు విడిది చేశారు. అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టు జ్ఞాపికను కలెక్టర్ వారికి అందజేశారు.