హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): చితికిన నేతన్న బతుకులకు భరోసా ఇచ్చి కాపాడుతున్నది రాష్ట్రం.. బాగుపడుతున్న జీవితాలను ఛిద్రం చేసేలా పన్నుల భారం మోపుతున్నది కేంద్రం. వస్త్రపరిశ్రమను ధ్వంసం చేస్తూ నేత కార్మికులను మళ్లీ ఆత్మహత్యలవైపు తరుముతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నేత కార్మికులను ఆదుకొనే బాధ్యత రాష్ర్టానిదేనంటూ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నది. వస్త్రపరిశ్రమపై జీఎస్టీని 12 శాతానికి పెంచి ఒకవైపు మరణశాసనం రాసి, మరోవైపు కార్మికుల ఆత్మహత్యలపై మొసలి కన్నీరు కార్చుతున్నది. నేతన్నను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ర్టానికి లేఖ రాయడంపై కార్మికులు మండిపడుతున్నారు.
కేంద్రప్రభుత్వ నిర్ణయాలతో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాధిత కుటుంబసభ్యులు తమను ఆదుకోవాలంటూ ఇటీవల ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం కూడా అందించారు. కిషన్రెడ్డి మాత్రం ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని బాధిత చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు లేఖ రాశారు. కేంద్రమంత్రి ఆదేశాల మేరకు ఆయన ప్రైవేటు కార్యదర్శి అశుతోష్ సలీల్ మంగళవారం లేఖ పంపించారు. బాధిత చేనేత కుటుంబాలకు సొంత ఇల్లు, పెన్షన్, హెల్త్కార్డులు ఇవ్వటంతోపాటు వారి పిల్లల చదువులకు అండగా నిలవాలని సూచించారు. మంత్రిగా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికులను ఆదుకోవాల్సిన కిషన్రెడ్డి, రాష్ర్టానికి లేఖ రాసి చేతులు దులుపుకోవటంపై నేతన్నలు మండిపడుతున్నారు.
జీఎస్టీ పెంపును నిరసిస్తూ చేనేత కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ బతుకులను రోడ్డుపాలు చేసేలా నిర్ణయాలు తీసుకొంటున్న కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య తెలిపారు. కుటీర పరిశ్రమగా ఉన్న చేనేత రంగంలో వినియోగించే నూలు, రంగులపై జీఎస్టీని 12 శాతానికి పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు.