హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వండి మహాప్రభో అంటూ తెలంగాణ ప్రభుత్వం పదులసార్లు అడిగింది. రైల్వేల్లో జరుగుతున్న అన్యాయానికి స్పందించండి అంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చారు. మొన్నటికి మొన్న ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్కు సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖలకు సమాధానం లేదు. పైగా.. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి.. ప్రశ్నలకు ప్రశ్నే జవాబు అన్నట్టు సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. రాష్ట్రం తన వాటా నిధులను, భూమిని సమకూర్చకపోవడంతోనే తెలంగాణలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయలేకపోతున్నట్టు మొసలికన్నీరు కార్చారు. అసత్యాలు, అర్ధ సత్యాలతో ఉత్తరమంతా నింపేశారు. రాష్ట్ర డిమాండ్లపై కనీసం స్పందించలేదు. చేసిన ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్లో ప్రస్తావిస్తానని, నిధులు ఇప్పిస్తానని మాట వరుసకూ అనలేదు. మూడొంతుల నిధులివ్వాల్సిన కేంద్రం రూపాయి విదల్చలేదు కానీ, ఒక వంతు వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అన్నట్టు వితండ వాదన చేశారు.