సూర్యాపేట : తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి లేదని తేల్చిచెప్పారు. అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియా తో మాట్లాడారు.
ఉద్యోగాల కల్పన పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో 25 సంవత్సరాలుగా బీజేపీ ఎలుబడిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గుజరాత్ లో ఒరగపెట్టింది ఏమి లేదని దుయ్యబట్టారు.
సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ లకు ప్రత్యామ్నాయం ఉన్న చోట కాంగ్రెస్, బీజేపీయేతరులే విజయం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అప్పులు తెచ్చి అదానీ(Adani) , అంబానీ(Ambani)లకు పంచిపెడుతుంటే తెలంగాణలో ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 40 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు.అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ బలహీన పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉంటారని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో లాభ పడ్డ రాష్ట్రాలు లేవని అన్నారు.