హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలు మళ్లీ దారిమళ్లింది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడవాల్సిన ఈ రైలును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్కు పంపించేసింది. ఈ నెల 30న బెంగాల్లోని హౌరా- న్యూ జల్పాయ్గురి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ శుక్రవారం ప్రకటించేశారు కూడా. గతంలోనూ తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలును నరేంద్రమోదీ ప్రభుత్వం బిలాస్పూర్కు తరలించింది.
రెండోసారీ మొండిచెయ్యే..
భారతీయ రైల్వేల ఆధునీకరణలో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించింది. 2019 జనవరిలో మొదలైన ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లను ఎంపికచేసిన జోన్లలో నడుపుతారు. ఈ రైలు వేగం గంటకు 160 నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కో రైలుకు దాదాపు రూ.97 కోట్లు రైల్వేశాఖ ఖర్చు చేస్తున్నది. ఈ రైళ్లను అంచెలంచెలుగా వివిధ ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. కేటాయించిన మార్గంలో వందే భారత్ రైలును నడిపేందుకు ముందుగా సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కాట్రా, ముంబై-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంధేరీ, చెన్నై-మైసూర్, నాగ్పూర్-బిలాస్పూర్ మధ్య ఈ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. ఐదో అంచె కేటాయింపుల్లో భాగంగా రైల్వే బోర్డు, సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరుచేసింది. కానీ, ఉన్నట్టుండి ఇక్కడి అధికారులకు కూడా చెప్పకుండా దానిని నాగపూర్- బిలాస్పూర్ సెక్షన్కు తరలించింది. ఆరో అంచె కేటాయింపుల్లో ఎస్సీఆర్కు కేటాయిస్తామని అప్పుడు కేంద్రం హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే ఆరో అంచెలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ను కేటాయించింది. దీంతో ఇక్కడి అధికారులు దాదాపు 30 మంది సిబ్బందికి ఈ రైలు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఈ రైళ్లు నడుస్తున్న ప్రాంతాలకు కూడా వెళ్లి వారు శిక్షణ తీసుకొని వచ్చారు. ఇక తెలంగాణకు వందేభారత్ వచ్చినట్టేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. ప్రధాని మోదీయే స్వయంగా ప్రారంభిస్తారని గొప్పగా చెప్పారు. తీరా ఈ రైలును కూడా ఈసారి బెంగాల్కు పంపినట్టు కేంద్ర రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది.
మీ పతార ఇంతేనా కిషన్రెడ్డిగారూ?
కేంద్రప్రభుత్వంలో మంత్రి కిషన్రెడ్డి పతార ఏపాటిదో వందే భారత్ రైలే తేల్చేసిందని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. రైలు వచ్చేసినట్టేనని సూరెక్కి కూసిన కేంద్రమంత్రి ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీస్తున్నారు. అసలు ఆ రైలును వేరే రాష్ర్టానికి తరలించిన విషయమైనా మీకు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
వస్తదో రాదో తెల్వదు
వందే భారత్ రైలు తరలిపోవటంపై ఎస్సీఆర్ అధికారులు నోరు మెదుపటం లేదు. రైలును బెంగాల్కు కేటాయించిన విషయం కూడా తమకు తెలియదని ఓ అధికారి తెలిపారు. ఏడో అంచె కేటాయింపులు వచ్చే ఏడాది జనవరిలో ఉన్నాయి. అందులో కూడా ఎస్సీఆర్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించటం అనుమానమేనని అంటున్నారు. అంటే తెలుగు రాష్ర్టాల ప్రజలకు హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే అవకాశం లేనట్టేనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.