హైదరాబాద్/ఆదిలాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు రైతులు, యావత్ ప్రజానీకం భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. నాందేడ్ జిల్లా కాందార్ లోహాలో ఈ నెల 26న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహాక సమావేశాలను సోమవారం గంగాఖేడ్, సోన్పేఠ్ తదితర తాలూకాల్లో నిర్వహించారు. సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ముఖ్యకార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోని ప్రతి రైతుకూ వివరించాలని, వారి మద్దతు కూడగట్టాలని సూచించారు. కాందార్ లోహాలో నిర్వహించనున్న సభకు రైతులను పెద్దసంఖ్యలో తీసుకురావాలని పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలు రంగనాథ్ చోప్డే, వైజనాథ్ సోలంకే, వివేక్ జాదవ్, బలిరామ్ సోలంకి, గణపత్ షిండే, రాంభావూ ఖోడే, మాధవ్ షిండే, సంజయ్ షిండే, రాజేభావూ షిండే, సత్యం చాప్టే, విష్ణుకాంత్ షిండే, రామ్ధాగే, అశోక్ షిండే, శ్యామ్ షిండే, పవన్ కార్వార్, భగవాన్ షిండే, సుధీర్ బిందు, గణేశ్రావు పాటిల్, భగవాన్ జోగ్దండ్, సోమనాథ్ నాగోర్, మౌలిజోగ్ దండ్, మాధవ్ జాదవ్, సూర్యకాంత్ కదం, అశోకరావు చభరే, పండిట్ అన్నా భోంస్లే, గణేశ్ జోగ్దండ్, అశోక్ చాడోడ్, దేవిదాస్ భుజబల్ పాల్గొన్నారు.
కాందార్ లోహా బైల్బజార్ మైదానంలోని 18 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ‘అబ్కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదం మహారాష్ట్ర గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణ మాడల్ కండ్లకు కట్టేలా 20 ప్రచార రథాలను, 10 ఎల్ఈడీ స్క్రీన్ల వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి హిమాన్షు తివారి, మహారాష్ట్ర నేతలు ప్రవీణ్ పవాడీ, అంకిత్ యా దవ్ ప్రచార రథాలను పర్యవేక్షిస్తున్నారు. లక్ష మంది ఈ సభకు హాజరుకానున్నారు. ఎన్సీపీ, వివిధ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు.