పర్వతగిరి, ఆగస్టు 7: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా గ్రామంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. ఎస్సై దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన ఎండీ యూసఫ్ భార్య మృతి చెందగా, ఇటీవల ఆయన తన ఇద్దరు పిల్లలు రెహాన్(6), కిజ్రా బేగం(2)ను తీసుకొని బతుకుదెరువు కోసం అన్నారం దర్గా గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో నాగపూర్కు చెందిన ఫిరోజ్ పరిచయమయ్యాడు. ఫిరోజ్ తన ఇంటి పక్కనే గదిని కిరాయికి చూపించి నమ్మకంగా ఉంటున్నాడు. యూసఫ్ కూలీ పనికి వెళ్తూ పిల్లలను కూడా తనతోపాటు తీసుకెళ్తున్నాడు. శనివారం పిల్లలు పని దగ్గరి ఎందుకు తన వద్ద ఉంటారని నమ్మబలికి ఫిరోజ్ వారిని తీసుకొని కనిపించకుండా పోయాడు. యూసఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారులతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 9440795207,7382608575 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు.