నిర్మల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ ఒంటెద్దు పోకడలతో అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తూ ఎన్నికల ప్రక్రియను నవ్వులపాలు చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను శనివారం మరోసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల పరిశీలుకుడిగా ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్, ఎన్నికల అధికారిగా నిర్మల్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవరత్నం వ్యవహరించగా మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నెల రోజులకుపైగా శిబిరాల్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
మొదట కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నుంచి అపహరించుకుపోయిన మహిళా కౌన్సిలర్ పోసానితో కలిసి కార్యాలయానికి వచ్చారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు వచ్చారు. మూడు పార్టీల కౌన్సిలర్లు హాజరు కావడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చైర్మన్ అభ్యర్థిగా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనికామహేందర్కు బీజేపీతోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు (మొత్తం ఏడుగురు) చేతులెత్తి మద్దతు తెలిపారు. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో మౌనిక చైర్మన్గా ఎన్నికైనట్లేనని అందరూ భావించారు. ఇంతలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఎన్నికల అధికారుల పోడియం వద్దకు చేరుకొని ఎన్నికల ప్రక్రియకు అడ్డుతగిలారు. ఈ ఎన్నిక చెల్లదంటూ.. తమ పార్టీకి ఏడుగురు సభ్యుల మద్దతు ఉందని, ముందుగా తమ అభ్యర్థి పేరు ప్రకటించాలని మొండివాదనకు దిగారు.
అధికారులు మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లను పిలవాల్సి ఉంటుందని తెలిపినప్పటికీ ఎమ్మెల్యే వినిపించుకోలేదు. రెండు గంటలకు పైగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో హైడ్రామా సాగింది. ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్ల ఒత్తిడి, బెదిరింపులు ఎక్కువ కావడంతో అధికారులు ఎన్నికను ఆదివారానికి వాయిదావేశారు. సమాచారాన్ని తెలుసుకొన్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్నాయక్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఆయా పార్టీల శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. బీజేపీ కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి సొమ్మసిల్లి పడిపోగా ఆమెను 108 అంబులెన్స్లో ఖానాపూర్ దవాఖానకు తరలించారు.
ఖానాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను అధికారి పార్టీ ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించడంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిర్మల్ కలెక్టర్ అభిలాషఅభినవ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. సంఖ్యాబలం లేకున్నా కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా పడేలాచేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోవడం దారుణమని దుయ్యబట్టారు. ఎన్నిక వాయిదాపడేలా చేసిన ఎమ్మెల్యే, సహకరించిన అధికారులపై కలెక్టర్, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరుగబోయే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా.. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక నేటికి వాయిదా పడేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఖానాపూర్కు తరలిరావాలని పిలుపునిచ్చారు.