ఖానాపూర్: బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో నాయక్కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదని, తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ సభలో సీఎం ప్రసంగించారు. జాన్సన్ నాయక్ను గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ కూడా గెలిచేది లేదు, సచ్చేది లేదని, దాని పని మటాష్ అయ్యిందని సీఎం వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తరట. దాని స్థానంల భూమాత పెడుతరట. ఎందుకు..? ధరణికి ఏమైంది..? కొత్తగా భూమాత దేనికి..? అది భూమాతనా..? భూ మేతనా..? మళ్ల దళారి రాజ్యం తెచ్చి జేబులు నింపుకోవడానికి ఈ భూమాత..? ధరణి ఉంటే రైతుబంధు డబ్బులు, పంట అమ్మిన డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో పడుతున్నయ్. మరె ధరణిని తీసేస్తే దళారీల రాజ్యం అయితది. అధికారులు రైతుల దగ్గర లంచాలు తీస్కోని పనిచేస్తరు. నేను గూడా రైతును కాబట్టి రైతులకు ఇబ్బందిలేని తీరుగా నిర్ణయాలు చేసిన. ఇంక కాంగ్రెసోళ్లు కౌలుదారు కాలం పెడ్తరట. భూమిని కౌలుదారు దున్నితే పైసలు రైతుకు ఇయ్యరట, కౌలుదారుకే ఇస్తరట. అంటే మూడేళ్లు కౌలుదారు దున్నితే మన భూమి ఆయన పాలైతది. మరె ఇయన్నీ జరుగాల్నా..? అట్ల జరగొద్దంటే మీరు బాగా ఆలోచించి ఓటేయాలె. కాంగ్రెస్ కు పొరపాటున గూడా ఓటేయొద్దు’ అని సీఎం సూచించారు.
‘ఖానాపూర్లో నిజాం సర్కారు సదర్మాట్ కట్టింది. దాని ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లు రావాలె.. కిందామీదా వస్తున్నయ్. సదర్మాట్ పైన మేం బ్యారేజ్ కట్టినం. అది కట్టింది మీ మంచి కోసమే. దాంతో మీకు పాత 15 వేల ఎకరాలకేగాక, కొత్తగా 20 వేల ఎకరాలకు సాగు నీరు వస్తది. అది నా బాధ్యత. దానిమీద అనుమానం అక్కర్లేదు. ఎవడో ఏదో చెప్తున్నడని నమ్మొద్దు. ఇగ జాన్సన్ నాయక్ నియోజకవర్గానికి సంబంధించి రెండు మూడు సమస్యలు చెప్పిండు. ఖానాపూర్ లో డిగ్రీ కాలేజీ కావాలన్నడు. రెవెన్యూ డివిజన్ కావాలన్నడు. అవి న్యాయమైన కోరికలు. కాబట్టి వాటిని నెరవేర్చే బాధ్యత నాది. జాన్సన్ నాయక్ నా కొడుకు రామ్కు క్లాస్మేట్. మొన్న రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్ను దత్తత తీసుకుంట అని చెప్పినట్లు తెలిసింది. ఇగ రామారావు దత్తత తీసుకున్నంక మీకేం తక్కువైతది..? కాబట్టి మీరు జాన్సన్ నాయక్కు ఓటేస్తే నాకు వేసినట్టే లెక్క. మంచి మెజారిటీతో జాన్సన్ నాయక్ను గెలిపించండి’ అని కోరారు.
‘జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లకు రాలె. ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చిండు. ఆయనకు అమెరికాలనే సొంతం సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే మంచిగ లేదు, పిచ్చిపిచ్చి యవ్వారం ఉన్నది, నీలాంటి చదువుకున్న బుద్ధి మంతులు వస్తే లాభం జరుగుతది, అని చెప్పి నేను పిలిస్తే జాన్సన్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చిండు. జాన్సన్ నాయక్ను గెలిపిస్తే మీకు ఏమేం కావాల్నో ఆ పనులన్నీ చేపిస్తనని నేను మనవి చేస్తున్నా. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలువబోతున్నది. కాంగ్రెది ఏమీ లేదు. అంతా మటాష్.. అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఇక్కడి నుంచి గల్ఫ్ పోయిన వారికి కూడా ఎన్నికల్లో గెలిచినంక మంచి చేస్తమని మనవి చేస్తున్నా’ అని సీఎం తెలిపారు.