హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పథకాలపై మళ్లీ ప్రశంసల జల్లు కురిసింది. కేంద్ర మంత్రులు, నిపుణులు, ఇతర పార్టీల నేతలే కాదు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మన పథకాలను ఆకాశానికి ఎత్తారు. ఖమ్మంలో కంటివెలుగు, సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు తెలంగాణ పథకాలకు మంత్రముగ్ధులయ్యారు. ముఖ్యంగా కంటివెలుగు, సమీకృత కలెక్టరేట్లను చూసి అబ్బురపడ్డారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా కలెక్టరేట్కు వస్తే సరిపోతుందని, ఇదొక విప్లవాత్మక నిర్ణయమని ప్రశంసించారు. 4 కోట్ల జనాభాలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ‘మేం ఒక పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చాం. కానీ ఇక్కడ అనేక మంచి విషయాలు నేర్చుకొని వెళ్తున్నాం’ అని సభలో ప్రకటించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఒకడుగు ముందుకేసి తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిపాదించే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ మాడల్ను దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పార్టీ తొలి బహిరంగ సభలో హైలైట్గా నిలిచింది.
కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్లపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. సమీకృత కలెక్టరేట్ను తాను పరిశీలించానని, అద్భుతంగా ఉన్నదని చెప్పా రు. ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ను నిర్మించి, అన్ని శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాలను ఒకే చోటికి చేర్చడం గొప్ప ఆలోచన అని కొనియాడారు. కంటివెలుగులాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఢిల్లీలోనూ కంటివెలుగు తర హా కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
కంటివెలుగు వివరాలు తెలుసుకొని పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఫిదా అయ్యారు. త్వరలో పంజాబ్లోనూ కంటివెలుగు తరహాలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమీకృత కలెక్టరేట్లు సైతం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ‘మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి. నేను తెలంగాణ నుంచి నేర్చుకొని వెళ్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమం అని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలకు నిర్వహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సమీకృత కలెక్టరేట్లు చక్కటి వేదికలని యూపీ మాజీ సీఎం, సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని తెలంగాణ సర్కారు విజయవంతంగా అమలు చేస్తున్నదని కొనియాడారు. ఈ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ కాపీ కొట్టిందన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రశంసించారు. కోతల్లేని 24 గంటల విద్యుత్తు, ప్రతి ఇంటికీ మంచినీటిని అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో దేశం కోసం మరిన్ని పథకాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని బీఆర్ఎస్ తొలి సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలోని దళితుల జీవితాలను మార్చేలా ఏటా 25 లక్షల మందికి దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. రైతు బంధు, ఉచిత కరెంటులాంటి తెలంగాణ సంక్షేమ పథకాలన్నీ దేశమంతా అమలు చేస్తామంటూ ‘భారత్కు తెలంగాణ మాడల్’ సంకేతాన్ని అందించారు.