మహబూబాబాద్ : ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసముద్రం మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా నుంచి 1.20లక్షల మంది తరలివెళ్లేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం సభ ద్వారా రాష్ట్రానికి దిశా, దేశానికి నిర్దేశం చేస్తారన్నారు.
ఖమ్మం బహిరంగ సభకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఉన్నతికి ఎన్నో పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి, ఇతర రాష్ట్రాల వారు రాబోయే ఎన్నికల కోసం మేనిఫెస్టోను తయారు చేసుకుంటున్నారన్నారు. అంతగొప్పగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్నారు.
విభజన హామీలు అమలుచేయకుండా సామాన్యులకు కనీసం అందుబాటులో లేని ధరలతో వందేభారత్ రైలును ప్రారంభించారని, అది ఎవరికి ఉపయోగమే మోదీ చెప్పాలన్నారు. పేదలకు అందుబాటులో ఉండే రైళ్లు పోయి ఆదాని, అంబానీ ట్రైన్లు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో తెలంగాణను తీర్చిదిద్దిన విధంగా దేశాన్ని సైతం నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, నేతుల నూకల నరేశ్ రెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్లు, మండల పరిషత్ చైర్మన్ చంద్రమోహన్, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.