జూలూరుపాడు, ఏప్రిల్ 7: మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనతికాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి నాయకులు అండగా ఉండాలని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకే భవిష్యత్తు ఉన్నదని, కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటికి కటకట ఏర్పడిందని, రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీటిని అందించలేకపోతున్నదని దుయ్యబట్టారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడి జిల్లాకు పలు రోడ్లను జాతీయ రహదారులుగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అమలుచేసిన పథకాలను అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని రద్దు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు.