Congress | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చులేకపోతున్నది. ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
తమ కుటుంబ సభ్యులకు టికెట్ దక్కకపోయినా తమకు అనుకూలంగా ఉన్న వారికి టికెట్ ఇప్పించుకునేందుకు లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రోజుకో పేరు వెలుగులోకి వస్తున్నది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన పేరు బయటకు రావడం వెనక ఎవరున్నారని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
స్థానికేతరుడైన ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని మెజార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తుమ్మల వర్గీయులు మాత్రం మండవ అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉండడం గమనార్హం. వారి ద్వారానే మండవ పేరు బయటకు వచ్చినట్టు తెలిసింది. గతంలో ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించిన రేణుకాచౌదరి, పీవీ రంగయ్య, నాదెండ్ల భాస్కర్రావు కూడా స్థానికులు కాదని గుర్తుచేస్తున్నారు. తుమ్మల వర్గీయులు మండవను వెనకేసుకొస్తుండడంతో ఆయన వెనక మంత్రి ఉన్నారన్న అనుమానాలకు బలం చేకూరుతున్నది. రేవంత్రెడ్డి పూర్వాశ్రమంలో మండవ వెంకటేశ్వరరావుకు సన్నిహితుడు కావడంతో ఆయన కూడా పావులు కదిపి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
రఘురాంరెడ్డి పేరు ఖరారుచేశాక పునరాలోచన
మంత్రుల కుటుంబ సభ్యులకు ఖమ్మం టికెట్ ఇచ్చేది లేదని అధిష్ఠానం తేల్చిచెప్పిన తర్వాత వరంగల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్టు తెలిసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి రఘురాంరెడ్డి వియ్యంకుడు కావడంతో అధిష్ఠానం ఆ తర్వాత పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మండవ పేరు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. మొదట ఈ టికెట్ను తన సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్లో చేరిక సమయంలో తాను సూచించిన వ్యక్తికే ఎంపీ టికెట్ ఇస్తామని మాట ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్రెడ్డి గుర్తు చేసినప్పటికీ అధిష్ఠానం వినిపించుకోలేదని సమాచారం.
12న అభ్యర్థుల ప్రకటన
పెండింగ్లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు 12న కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 11న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమై పెండింగ్లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావించింది. ఆ రోజున రంజాన్ పండుగ నేపథ్యంలో మరుసటి రోజు సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెండింగ్లో ఉన్న మూడు స్థానాల్లో ఒకటైన హైదరాబాద్ విషయంలో ఎంఐఎంతో కుదిరిన లోపాయికారీ ఒప్పందం మేరకు బలహీన అభ్యర్థిని బరిలోకి దించబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ఖాన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. కరీంనగర్ నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.