గంభీరావుపేట, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ విద్యానిలయం సిద్ధమైంది. ‘మన ఊరు- మన బడి కింద’ మంత్రి కేటీఆర్ చొరవ, గివ్ తెలంగాణ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసౌధం ఆవిష్కృతమైంది.
రూ.3 కోట్లతో ఆరెకరాల స్థలంలో ఏకకాలంలో 3,500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం అభ్యసించేందుకు 70 తరగతి గదులతో చదువుల భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.