కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకపాత్ర అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కోర్టులో న్యాయవాదులకు జాతీయ పథకాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పార్టీలు..రాజకీయాలు అని…ఇప్పుడు అభివృద్దే ధ్యాసగా పనిచేస్తున్నానన్నారు. కరీంనగర్ అభివృద్ది చెందాలని కోరుకునే వారిలో తాను ముందువరుసలో ఉంటానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత స్వయం పాలనలో కరీంనగర్ ను గొప్పనగరంగా తీర్చిదిద్దుతున్నానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు సైతం కీలక పాత్ర పోషించారని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని హామీ నిచ్చారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, చల్ల హరిశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.