ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడికీ అడ్డుకట్టవేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. స్కూల్ ఫీజులను ఖరారుచేసే అధికారాన్ని పాఠశాల గవర్నింగ్ బాడీకి అప్పగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రులు, యాజమాన్యం, టీచర్లతో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇకపై ఈ కమిటీలే ఆ విద్యాసంవత్సరానికి స్కూల్ ఫీజుల స్ట్రక్చర్ను ఖరారు చేయనున్నాయి.
School Fees | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఫీ‘జులుం’కు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బడిలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, దాని నిర్ణయం మేరకే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నది. వసూలైన ఫీజులో నుంచి 5 శాతం మాత్రమే యాజమాన్యాలు ఆదాయంగా తీసుకోవాలని, ఫీజుల్లో 50 శాతం పాఠశాల ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలుగా చెల్లించాలని స్పష్టంచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం మెమో – 6986 ను జారీచేశారు. యాజమాన్యాలు వసూలు చేసే ఫీజులను పాఠశాల నోటీసుబోర్డుపై ప్రదర్శించటంతోపాటు పాఠశాల వెబ్సైట్లోను అప్లోడ్చేయాలని ఆదేశించింది. విద్యాసంస్థను నిర్వహించే సొసైటీ వార్షిక రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది.
క్యాపిటేషన్ ఫీజు వసూలుచేస్తే చర్యలు
స్పెషల్ ఫీజులను విద్యాసంవత్సరంలో పాఠశాల ప్రారంభంలో ఒకసారి మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ స్పష్టంచేసిం ది. యాజమాన్యాలు క్యాపిటేషన్ ఫీజులు తీసుకోరాదని, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసినట్టు తేలితే ఆ యాజమాన్యాం నుంచి పదిరెట్ల జరిమానా వసూలు చేస్తారు. గవర్నింగ్ బాడీలో యాజమాన్యం, టీచర్లు, తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. విద్యాసంస్థకు నిర్వహణ, పరిపాలన, విద్యార్థుల అడ్మిషన్ల విషయాల్లో గవర్నింగ్ బాడీ తగు సలహాలిస్తుంది. విద్యాసంస్థ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సిబ్బంది జీతాలను ఖరారుచేస్తుంది. గవర్నింగ్ బాడీ నిర్ణయం ప్రకారం నెలవారీగా లేదా మూడు నెలలు, ఆరు నెలలకు ఫీజులు తీసుకోవచ్చు.
ఫీజుల ఖరారు ఇలా..
ఫీజులను ఖరారుచేసేందుకు ఏయే అంశాలను పరిగణిలోకి తీసుకోవచ్చో విద్యాశాఖ వెల్లడించింది. సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల వ్యయం, భవనం అద్దె, విద్యుత్తు, వాటర్ చార్జీలు, స్టేషనరీ, స్టాంపులు వంటి కార్యాలయ అవసరాలు, ఖర్చులు, తరగతి గది ఖర్చులైన చాక్పీసులు, డస్టర్ల వ్యయం, గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగశాలల్లో వాడే కెమికల్స్ వ్యయం, ఆడిటర్ల పారితోషికం, విద్యాసెస్సు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారుచేయాలి.
గవర్నింగ్ బాడీ స్వరూపం
ఆరుగురు సభ్యులతో గవర్నింగ్ బాడీ ఏర్పాటవుతుంది. సంబంధిత విద్యాసంస్థ అధ్యక్షుడు, సెక్రటరీ/కరస్పాండెంట్/మేనేజర్, హెచ్ఎం/ప్రిన్సిపాల్, టీచర్, పేరెంట్ టీచర్ అసొసియేషన్ అధ్యక్షుడు, డీఈవో నామినేట్ చేసిన విద్యావంతురాలైన తల్లి సభ్యులుగా ఉంటారు. విద్యాసంస్థ అధ్యక్షుడు గవర్నింగ్బాడీకి చైర్మన్గా సెక్రటరీ/కరస్పాండెంట్/మేనేజర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.