ముంబై, జూలై 8: కొద్దిరోజులుగా వరుస రికార్డులు సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్లకు గురువారం గ్లోబల్ షాక్ తగిలింది. విదేశీ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాల్ని చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 486 పాయింట్లు క్షీణించి 52,569 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 15,728 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇటు జపాన్ నుంచి అటు యూరప్ వరకూ అన్ని ప్రధాన దేశాల మార్కెట్లూ 1.5-3 శాతం మధ్య నష్టపోగా, అమెరికా సూచీలు తీవ్ర నష్టాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి.
భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్లు)లోకి జూన్లో పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. రూ.5,988 కోట్ల పెట్టుబడులే వచ్చాయి. మే నెలలో ఆకర్షించిన రూ.10,083 కోట్లతో పోల్చితే 40 శాతం తక్కువ. కాగా, ఈక్విటీ స్కీముల్లోకి ఈ ఏడాది మార్చిలో రూ.9,115 కోట్లు, ఏప్రిల్లో రూ.3,437 కోట్ల నిధులు వచ్చాయి.