ఇంద్రవెల్లి, జనవరి 27: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈనెల 31న అర్ధరాత్రి నాగోబా జాతర ప్రారంభం కానున్నది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తలమడుగు నుంచి గంగాజలంతో బయల్దేరిన మెస్రం వంశీయులు గురువారం రాత్రి కెస్లాపూర్ చేరుకొన్నారు. ముందుగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో పూజ లు చేశారు. పవిత్ర గంగాజలం ఝరిని మర్రిచెట్ల ప్రాం తంలోని మోత్కాకు చెట్టుపై తెల్లని వస్త్రంతో కట్టి భద్రపరిచారు. అక్కడే గుడారాలను ఏర్పాటు చేసుకొని బసచేస్తున్నారు. ఈనెల 31న నాగోబాకు నిర్వహించే మహా పూజలతోపాటు తూమ్ (పిండ ప్రదానం) పూజల నిర్వహణపై శుక్రవారం చర్చించనున్నట్టు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతానికి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్టు ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కలపకుంట, అకొండపేట చెరువుకు నార్తన్ పిన్ టైల్ బాతుజాతికి చెందిన పక్షులు వారం రోజుల క్రితం చేరుకొని విహరిస్తున్న ట్టు పేర్కొన్నారు. ఈ జాతి పక్షులు హైదరాబాద్, మంజీర, ఉస్మాన్సాగర్ తదితర ప్రాంతాలకు మాత్ర మే వచ్చేవని, ఇప్పుడు కవ్వాల్ టైగర్ జోన్లోని చెరువు వద్ద కనిపించినట్టు తెలిపారు. సుమారు 8,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకొంటాయని ఎఫ్డీవో వివరించారు. – నిర్మల్ టౌన్