హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి వసతి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించొచ్చని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ కే కేశవులు పేర్కొన్నారు. బలమైన, నాణ్యమైన విత్తన వ్యవస్థను కలిగి ఉండటం వల్లే అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్, భారత్ ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాయని తెలిపారు. శుక్రవారం ఆయన కెనడాలో నిర్వహించిన అమెరికా విత్తన సంస్థల వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. ఆహార భద్రత పూర్తిగా విత్తన నాణ్యతపైన ఆధాపడి ఉంటుందని చెప్పారు. విత్తన పరిశ్రమలో అమెరికా గుత్తాధిపత్యం సాధించినప్పటికీ ప్రధాన వృద్ధి మాత్రం ఆసియా, పసిఫిక్ దేశాల్లో కనిపిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఉదహరించారు. నాణ్యమైన విత్తనాల సరఫరాపై దృష్టి పెట్టడంతోపాటు పెట్టుబడి సాయం, సాగునీటి సమస్య పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారభద్రత, పోషక భద్రత కల్పించాలంటే పంట ఉత్పత్తులు పెంచాల్సిందేనని స్పష్టంచేశారు. ఇందుకోసం అన్ని దేశాల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సమావేశంలో అమెరికా సంస్థలైన అసోసియేషన్ ఆఫ్ అఫీషియల్ సీడ్ అనలిస్ట్స్ (ఏవోఎస్ఏ), సొసైటీ ఆఫ్ సీడ్ టెక్నాలజీ (ఎస్సీఎస్టీ), ఎఫ్ఏవో, ఐఎస్ఎఫ్, వోఈసీడీ, యూఎస్డీఏ ప్రతినిధులు పాల్గొన్నారు.