Muziris port | సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పట్టాణం ప్రాంతానికి సమీపంలో ఉన్న ముజిరిస్ ఓడరేవు ఇనుప యుగం నాటిదని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నోస్టిక్ డైరెక్టర్ కుమారస్వామి తంగరాజ్ బృందం తేల్చింది. నైరుతి తీరంలోని ఈ ప్రాంతం భారతదేశం, మధ్యప్రాచ్యం నడుమ వాణిజ్యం, సంస్కృతి మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్టు ఆధారాలు ఉన్నాయి. డీఎన్ఏ విశ్లేషణల ద్వారా ఈ ప్రాంతం ఐరన్ ఏజ్ (ఇనుపయుగం) నాటి ఆనవాళ్లను పోలి ఉన్నట్టు తేల్చారు.
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని డాక్టర్ పీజే చెరియన్ నిర్వహించిన అధ్యయనాన్ని తాజాగా ప్రచురించారు. పట్టాణం పురావస్తు ప్రాంతంలో దొరికిన మానవుల ఎముకలు, పాత్రలు, బంగారు ఆభరణాలు, గాజు, రాతి పూసలు, రాతితో చేసిన ఇతర వస్తువులు, రాగి, ఇనుము వస్తువులను పరిశోధించారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య రోమన్ల ఆక్రమణలకు గురైనట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని చెరియన్ తెలిపారు. పురాతన కాలం నాటి 12 అస్థిపంజర డీఎన్ఏ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్టు పేర్కొన్నారు