హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చిందని, ఆ పార్టీ అధికారంలో ఉంటే పేదలు మరింత పేదలుగా మారుతారని, కేంద్రంలో ఉన్నది కార్పొరేట్ల ప్రభుత్వమని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. భారత రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రజా ఉద్యమంలో ముఖ్యమంత్రులను భాగస్వామ్యులుగా చేయడం, ఒకే భావజాలం ఉన్నవారిని ఈ వేదికపైకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామని కొనియాడారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ఈ తరహా రాజకీయ సమీకరణ అవసరమంటూ దేశ ప్రజలు దీన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను తనదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం గురించి మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదించే జడ్జీలను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రతిపాదించారు. ఉప రాష్ట్రపతి ఎన్జీఏసీ విషయంలో సుప్రీంకోర్టు తీరును తప్పుపట్టారని, ఇది న్యాయవ్యవస్థ మీద మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడి కాదా? అంటూ నిలదీశారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం చెప్పిందే న్యాయమన్నట్టుగా మారుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితని వెల్లడించారు.
దేశంలోని కార్పొరేట్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దోచిపెడుతున్నదంటూ, మొండిబకాయిల వసూళ్ల కోసం పేద రైతులను వేధించే బ్యాంకులు కార్పొరేట్ పెద్దలు తీసుకున్న రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేయడం దేనికి సంకేతమని విజయన్ ప్రశ్నించారు. ఒకటి రెండు కాదు లక్షల కోట్లను మాఫీ చేశారని, దేశ ప్రజలు వీటిపై చర్చించాలని కోరారు. దేశ రాజకీయాల్లో పరివర్తన వస్తున్నదని, బీజేపీ ఆటలు ఇంకెంత కాలమో సాగవని స్పష్టం చేశారు.
ఉద్యమాలకు, పోరాటాలకు తెలంగాణ నిలయమని విజయన్ కీర్తించారు. స్వాతంత్య్రానికి పూర్వం భూపోరాటాలు జరిగాయంటూ, దేశ స్వాతంత్య్ర పోరాటంలో కూడా ఇక్కడి వారు పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. దేశాన్ని ఇప్పుడు పాలిస్తున్న పార్టీ, స్వాతంత్య్ర ఉద్యమంలో ఎక్కడ ఉన్నదంటూ, ఆనాటి ఈ పార్టీ పెద్దలు వలసపాలకులకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, విభజనవాదాన్ని తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. భారత దేశం రాష్ర్టాల సమాహారమని, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల సమ్మేళనమని, భారత రాజ్యాంగంలో కూడా ఇది ఉన్నదని చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టాల ప్రాధాన్యతను తగ్గించే కుట్రకు తెరలేపుతున్నదని విమర్శించారు. హిందీని దేశంలోని అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ, మాతృభాషలను కాదని హిందీ మాత్రమే ఉండాలన్నట్టుగా చేస్తున్నారని ఆరోపించారు. ఇది వాంఛనీయం కాదన్నారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టాల హక్కులను హరిస్తున్నదని, రాష్ర్టాలను ఆర్థికంగా దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రాష్ర్టాలపై ఆర్థిక ఆంక్షలను పెడుతూ రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను రాజ్భవన్ను అడ్డుపెట్టుకొని ఇరకాటంలోకి నెట్టే పన్నాగం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ హితవు పలికారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమ ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం రాజ్యాంగబద్ధమేనా? ఇది ఏ తరహా రాజనీతి? అంటూ ప్రశ్నించారు?
తెలంగాణ ప్రభుత్వం రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ముదావహమని విజయన్ అన్నారు. ఈ తరహా కార్యక్రమం దేశంలో మునుపెన్నడూ జరగలేదని పొగిడారు. తెలంగాణ కంటివెలుగు ఆచరణాత్మకమైనదని, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ప్రశంసించారు. సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభించుకోవడం, రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన వంటి వాటితో పరిపాలన వికేంద్రీకరణ జరుగుతున్నదని చెప్పారు. కేరళ రాష్ట్రంలో కూడా పరిపాలనను ప్రజల కోణంలో అందిస్తున్నామని విజయన్ చెప్పారు.