KCR | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని తెలిపారు. అక్రమ కేసులను వెంటనే వెనకి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.