CM KCR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (నమసేన్త తెలంగాణ): ‘నది చేపలతో నిండినట్టుగా.. ఓ ప్రభూ ఈ నగరం ప్రజలతో నిండిపోవాలి’ 1591లో హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది రాయి వేసిన సమయంలో కులీకుతుబ్షా అన్న మాటలివి. ఏ సుముహూర్తాన పునాదిరాయి పడిందో గానీ హైదరాబాద్ నగరం ఇంతింతై.. అన్నట్టు విశ్వనగరంగా ప్రపంచపటంలో నిలిచింది. ప్రధానంగా గత రెండు దశాబ్దాలుగా నగర విస్తరణ అనేది ఊహలకందనిదిగా మారింది.
2000 సంవత్సరంలో సుమారు 56.50 లక్షలుగా ఉన్న జనాభా ఇప్పుడు 1.20 కోట్లకు చేరుకున్నది. గత తొమ్మిదేండ్లలో నగర విస్తరణ వేగం దేశంలోని మరే ఇతర మెట్రో నగరాల్లోనూ కనిపించదు. ఈ మహా నగర ప్రస్థానంలో ప్రతి అడుగూ ఒక సవాలే! సమస్యల సుడిగుండమే!! గత పాలకులు హైదరాబాద్ను కేవలం ఒక ఆర్థిక వనరుగానే భావించారు తప్ప భావితరాలకు మెరుగైన మౌలిక వసతులు ఉన్న చారిత్రక నగరాన్ని అందించాలనే ముందుచూపు కొరవడింది. తెలంగాణ ఏర్పడే నాటికి జరిగిన నగరాభివృద్ధిలో ఎక్కడా పట్టుమని పదేండ్ల ముందుచూపు కనిపించదు. రహదారులు, తాగునీరు, ప్రజా రవాణా, వైద్యసేవలు.. ఇలా ఏ రంగంలోనూ దూరదృష్టి కనిపించదు. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న నగరంలో అప్పటి నిజాం కల్పించిన మౌలిక వసతులకు అతుకులు వేసి దానికి అభివృద్ధి అని పేరు పెట్టారు. అప్పటికప్పుడు పూట గడిపినట్టుగానే డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థల్ని నిర్మిస్తూ వచ్చారు. విజయవాడ నుంచి రైల్వే వ్యాగన్లలో తాగునీటిని తరలించే దుస్థితికి ఈ మహానగరాన్ని దిగజార్చారు. చినుకుపడితే ఉప్పొంగే మ్యాన్హోళ్లు, నదులను తలపించే రహదారులు నేటికీ వారసత్వంగా నగరవాసుల్ని వేధిస్తూనే ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పంథా వేరు. రూపొందిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు వేరు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్తోనే రాష్ర్టాన్ని సాధిస్తానంటూ ఇచ్చినమాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు ఆది నుంచి నగరాభివృద్ధిపై ఒక విజన్ ఉన్నది. ప్రపంచంలోనే అతి కొద్ది నగరాలకు ఉండే భౌగోళిక, వాతావరణ అనుకూలతలు ఉన్న ఈ చారిత్రక నగరాన్ని సరైనరీతిలో అభివృద్ధి చేస్తే తెలంగాణకు రాజధానిగానే కాదు.. భారతదేశానికే తలమానికమైన నగరంగా ఎదుగుతుందని గుర్తించారు. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాభివృద్ధికి వేసిన ప్రతి అడుగులోనూ అలాంటి ముందుచూపు కనిపిస్తుంది. మనిషికి అత్యంత ప్రాణాధారమైనది జలం. తెలంగాణ ఏర్పడేనాటికి పాలకులు నగర తాగునీటి అవసరాల కోసం నదుల వెంట పరుగులు తీశారేగానీ ఏ ఒక మంచినీటి ప్రాజెక్టులోనూ ముందుచూపు కనిపించదు. కానీ సీఎం కేసీఆర్ అటు కృష్ణా మూడో దశతోపాటు గోదావరి తాగునీటి పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాదు.. ఇకపై నదుల వెంట పరుగులు తీసే పని లేకుండా కాళేశ్వరం జలాలతో నగరానికి అనుసంధానించారు. మరోవైపు కృష్ణాలోనూ సుంకిశాల పథకంతో శాశ్వత భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మహా నగరానికి రానున్న వందేండ్లలోనూ అందునా కరువు పరిస్థితుల్లోనూ తాగునీటికి ఢోకా లేకుండా పకడ్బందీ చేసి పెట్టారు.
రహదారుల వ్యవస్థలోనూ గత తొమ్మిదేండ్లలో వచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఎల్బీనగర్ జంక్షన్.. ఉప్పల్ జంక్షన్.. వెస్ట్జోన్తో సహా నగరవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్లాంటి సెలబ్రిటీలను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి. అదే ఒరవడిగా… సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఆషామాషీగా లేవు. రానున్న వందేండ్లలో భావి తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వైద్యరంగంలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా కేవలం 67 కిలోమీటర్ల మెట్రో ఏకంగా 415 కిలోమీటర్లకు విస్తరిస్తుండటం, ప్రభుత్వ వైద్యరంగంలో సూపర్ స్పెషాలిటీ సేవలతో దాదాపు పది వేల పడకలు వస్తుండటం, అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం ఉన్న నగరంలో మరో విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం సీఎం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనం.