హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): దేశమంతా తెలంగాణ మాడల్ అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ చేరికల సమావేశం ఏర్పాట్లను విప్ బాల సుమన్, ఎమ్మెల్యే షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ తదితరులతో కలిసి మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశంలోని అనేక ప్రాంతాల నాయకులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 5న నిర్వహించనున్న సమావేశంలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారని తెలిపారు. ఎనిమిదేండ్ల కాలంలోనే కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానానికి చేరిందన్నారు. ఫిబ్రవరి 5న నాందేడ్లో నిర్వహించనున్న చేరిక సమావేశం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
గురుద్వార్లో ప్రత్యేక పూజలు
నాందేడ్లోని గురుద్వార్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల సుమన్, జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ తదితరులు దర్శించుకున్నారు.