హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్ ప్రశంసించారు. మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ గురువారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రధానిపై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వార్తాసంస్థ ‘బ్రట్’ రూపొందించిన వీడియోను ప్రశాంత్భూషణ్ జతచేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టారు.
మోదీ అరాచకాలను తవ్వితీశారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. రూపాయి పతనం, మోదీ ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వాలను కూలదోయడంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కడిగిపారేశారని బ్రట్ పేర్కొన్నది. రూపాయి పతనంపై మోదీ 2012లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కరెన్సీ పతనం కావడం లేదు. భారత్ రూపాయి విలువ ఎందుకు పతనం అవుతున్నది? కారణం చెప్పాలి?’ అంటూ మోదీ 2012లో చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు, ఇప్పుడు మేం అదే అడుగుతున్నాం. దేశ రూపాయి విలువ ఎందుకు పతనం అవుతున్నదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి’ అంటూ కేసీఆర్ నిలదీశారని బ్రట్ చెప్పింది.
మోదీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, వారికి కావాల్సింది నియంతృత్వం అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాఖ్యలను సైతం వీడియోలో పొందుపరిచింది. మహారాష్ట్ర ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొడుతున్నదని, మూడింట రెండొంతుల మెజార్టీతో ఉన్న ప్రభుత్వాలను కూలగొడుతామని ఎలా హెచ్చరిస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం సంస్థ ఈ వీడియోలో పేర్కొన్నది. ప్రశాంత్భూషణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోను సుమారు 94వేల మంది వీక్షించారు. 6,500 లైకులు రాగా, 1800 మందికిపైగా రీట్వీట్లు చేశారు.