KCR | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ సోమవారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. రోడ్షోలు, బస్సుయాత్రలతో రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల, మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భారీ సభలు పెట్టి ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఈ నెల 22 నుంచి రోడ్షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో బస్సుయాత్ర చేస్తూ రోడ్షోలలో పాల్గొననున్నారు. రోడ్షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్మ్యాప్ను పార్టీ నేతలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల మేరకు రోడ్షోలు మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. మొదటిరోజు మిర్యాలగూడలో ప్రారంభమై హుజూర్నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు సూర్యాపేట నుంచి తిరుమలగిరి, జనగామ, ఆలేరు మీదుగా రాత్రికి ఎర్రవల్లికి చేరుకోనున్నారు. మూడో రోజు ఎర్రవల్లిలో మొదలై వరంగల్లో రోడ్షో చేయనున్నారు. రాత్రి అక్కడే ఉంటారు.
మరుసటిరోజు తొర్రూరు, మరిపెడ నుంచి ఖమ్మం చేరుకునేలా యాత్రకు రూపకల్పన చేస్తున్నారు. ఆ రాత్రి ఖమ్మంలో బస చేసిన అనంతరం వైరా, తల్లాడ, కొత్తగూడెంలలో రోడ్షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఆ రాత్రి కొత్తగూడెంలో బస చేసి.. అక్కడి నుంచి ఇల్లెందు, మహబూబాబాద్, నర్సంపేటలో రోడ్షోలలో పాల్గొని రాత్రి వరంగల్ చేరుకోనున్నారు. మరుసటి రోజు భూపాలపల్లి, పరకాల, జమ్మికుంటల్లో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి సింగాపురంలో ఉంటారు. అక్కడి నుంచి మరుసటిరోజు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాలల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిర్యాల నుంచి నేరుగా కరీంనగర్ చేరుకొని అక్కడ బస చేస్తారు. కరీంనగర్ నుంచి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో రోడ్షోలలో పాల్గొంటారు. రాత్రి మెట్పల్లిలో ఉండి తర్వాతి రోజు బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మోర్తాడ్, కమ్మర్పల్లి తదితర గ్రామాల్లో రోడ్షోల్లో పాల్గొని ఆర్మూరు మీదుగా నిజామాబాద్ చేరుకుంటారు. రాత్రి నిజామాబాద్లో బస చేస్తారు.
అనంతరం నిజామాబాద్ నుంచి బాన్సువాడ, ఎల్లారెడ్డి నుంచి మెదక్ చేరుకుంటారు. మెదక్లో బస చేసి తర్వాతి రోజు నర్సాపూర్, మేడ్చల్, పటాన్చెరువు నియోజకవర్గాల్లో జరిగే రోడ్షోలలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్లో బసచేస్తారు. తర్వాత రోజు నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, నాగర్కర్నూల్లో పర్యటించి రాత్రి వనపర్తిలో బస చేసే అవకాశం ఉన్నది. అక్కడి నుంచి తెల్లారి జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఐజ, గద్వాలలో ప్రచారంలో పాల్గొంటారు. గద్వాలలో రాత్రి బస చేస్తారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన రూట్మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టమైన రూట్మ్యాప్ను పార్టీ విడుదల చేయనున్నది. అయితే, ముగింపు సభ మాత్రం సిద్దిపేటలో పెట్టాలని యోచిస్తున్నారు. రోడ్షోలతోపాటు మధ్యమధ్యలో ఒకట్రెండు చోట్ల సభలను కూడా పెట్టాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై కూడా ఆలోచిస్తున్నారు.