KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న రోజున తాను విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. నందినగర్లోని తన నివాసంలో అధికారులు నోటీసులు ఇవ్వడంపై గులాబీ అధినేత ప్రత్యుత్తరం రాశారు. శుక్రవారం విచారణ కుదరని ఆయన పోలీసులకు వివరించారు. అంతేకాదు తనను ఎర్రవల్లిలోనే మరోరోజు విచారణ చేయాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
సిట్ అధికారులు గురువారం తనుకు నోటీసులు జారీ చేయడంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని వారు కోరారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఆఖరు తేదీ కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంతో తాను బిజీగా ఉన్నానని విచారణను మరోరోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లిహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు గులాబీ బాస్.
బ్రేకింగ్ న్యూస్
సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను
విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు – కేసీఆర్ https://t.co/k52L0vK6fD pic.twitter.com/nBxkTap20c
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026
సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలోని నివాసంలో విచారించాలి. అంతేకాదు ఈ సెక్షన్లోని నిబంధనల మేరకు నాకు మీరు ముందస్తు నోటీసులు పంపించి ఆ తర్వాతే విచారించాలి. మరో విషయం 65 ఏళ్లు పైబడిన పురుషులను వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్ వెళ్లనవసరం లేదు. పోలీసులే వారి ఇంటివద్దకు వెళ్లి విచారణ చేపట్టాలి. ఇకపై నాకు పంపాల్సిన నోటీసులను నేను నివసిస్తున్న ప్రాంతానికి అంటే.. ఎర్రవల్లికే పంపాలి. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.