కోదాడ/నేరేడుచర్ల, జనవరి 16: ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దేశ సమాజాన్ని మతం, కులం పేరిట విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్లోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో మంత్రి మాట్లాడారు.
ఖమ్మం వేదికగా నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఇతర రాష్ర్టాల సీఎంలతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ కీలకంగా మారబోతున్నదని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు భారీ స్థాయిలో బీఆర్ఎస్కు, కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆయా పట్టణాల్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అభివృద్థి పథంలో నడుస్తున్న తెలంగాణను చీకట్లోకి నెట్టేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుత ఫలితాలు సాధించింది తెలిపారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది మన రాష్ర్టానికి చెందినవేనని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ అభివృద్ధి సూచీలో మన రాష్ట్రమే అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. రెప్పపాటు కూడా విద్యుత్తు అంతరాయం కలగని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమేనని తెలిపారు.
అబద్ధాలలో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారని, ఎన్నికల హామీల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటికీ 200 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గ కేంద్ర పాలన కౌగిలిలో నలిగిపోతున్న భరతమాతకు విముక్తి కల్పించేందుకు కేసీఆర్ జాతీయస్థాయిలో బీఆర్ఎస్ను ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ బాగుపడుతుంటే ప్రధాని మోదీ, ఇక్కడి బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు పాల్గొన్నారు.