KCR | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్కు 4+4 భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. యశోద దవాఖాన నుంచి శుక్రవారం డిశ్చార్జి అయిన బీఆర్ఎస్ అధినేత నందినగర్లోని తన ఇంటికి చేరుకున్న వెంటనే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. వై క్యాటగిరి భద్రత కల్పించింది. ఇందులో భాగంగా కేసీఆర్కు 4+4 భద్రత లభిస్తుంది. అంటే ఆయన వెంట నిత్యం నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు.
వారి విధులు ముగిసిన తర్వాత మరో నలుగురు వచ్చి చేరుతారు. ఇంటి ముందు ఓ హెడ్కానిస్టేబుల్తో సెంట్రీ విధులు, మరో హెడ్కానిస్టేబుల్తో పహారా ఉంటుంది. అవసరమైతే సెక్యూరిటీ కమెండోలను కూడా కేటాయించాలి. భద్రతా అవసరాల దృష్ట్యా ఓ ఎస్ఐ ర్యాంకు అధికారి కూడా ఉంటారు. కేసీఆర్కు థ్రెట్ పర్సప్షన్ రేట్ తక్కువగా ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణకు పదేండ్లపాటు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వం కనీసం వైప్లస్ క్యాటగిరీ భద్రతనైనా కేటాయిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ప్రభుత్వం మాత్రం వై క్యాటగిరీ భద్రతకే మొగ్గుచూపడం గమనార్హం.