ఈయన గాంధీనాయక్!
తెలంగాణలో ఏ ఆందోళన జరిగినా వాలిపోయే ఉద్యమకారుడు!
తెలంగాణ సాకారమయ్యేదాకా సగం గడ్డం, సగం గుండుతో వినూత్న నిరసన తెలిపిన సాధారణ కార్యకర్త! జీవనోపాధి తాను నడిపే ఆటో! కానీ.. ఉద్యమాన్ని నడిపే కేసీఆర్ వెంట నడిచారు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడారు!
ఉద్యమకాలంలో గాంధీనాయక్ కృషిని కేసీఆర్ గమనిస్తూ వచ్చారు! ఆ నిబద్ధతకు, అంకిత స్వభావానికి, తెలంగాణ కోసం దేన్నీ లెక్కచేయని ఆయన తత్వాన్ని గుర్తించారు! బాధ్యతలప్పగిస్తే బాధ్యతగా పనిచేస్తారని భావించి.. ఆ గిరిజన బిడ్డను తెలంగాణ గిరిజన సహకార సంస్థ తొలి చైర్మన్ను చేసి.. జాతి ప్రయోజనాలు కాపాడాలని నిర్దేశించారు.
రైతు తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు చల్లి మొక్కలు మొలిపించినట్టు.. ఉద్యమమనే తెలంగాణ క్షేత్రంలో పోరు వీరులనే విత్తనాలను చల్లి, కేసీఆర్ పాలనా హీరోలను మొలిపించారు. రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ప్రజా నాయకులు కూడా దక్షులైన నాయకులుగా ఎదుగుతున్నారు. తను నడుస్తూ, వెంట నడిచిన వారిని నడిపిస్తూ సాగుతున్న కేసీఆర్- తెలంగాణకు నేటితో ఏడేండ్లు!!
ఆయనది నిరుపేద కుటుంబం. చేసేది డ్రైవర్ పని. కేసీఆర్ ఉద్యమ జెండా ఎత్తగానే… చేస్తున్న ఉద్యోగం వదిలి ఆయన వెంట నిలిచాడు. మొదట్లో కేసీఆర్ ఆయన్ని గమనించలేదు. రోజూ తన వెంటే ఉండడం చూసి..
“పనిచేసుకో.. చిన్న జీవితం.. చిన్న జీతం కదా.. ఎందుకు నాతో వస్తున్నావు. భార్యా పిల్లల పోషణ ఎట్లా?” అని అడిగారు కేసీఆర్.
“నా భార్య ఇండ్లల్లో పనిచేస్తది. పిల్లల్ని సాదుకుంటది. తెలంగాణ కోసం నేను మీతో వస్తా. వచ్చేదాకా కొట్లాడుతా” అన్నాడతను. పైసా ఆశించకుండా కేసీఆర్తో కలిసి నడవడం మొదలుపెట్టాడు.
తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆరోజు కేసీఆర్ జన్మదినం. నాయకుడిని కలిసేందుకు అతడు కూడా వెళ్లాడు. పెద్ద క్యూలైన్. అంత క్యూలోనూ కేసీఆర్ అతడిని గుర్తు పట్టాడు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నడు.
“మన రాష్ట్రం మనకు వచ్చింది. మన శ్రమ వృథా కాలేదు. నువ్వు ప్రభుత్వంలో భాగం కావాలి” అన్నారు కేసీఆర్.
ఇది జరిగిన కొద్ది రోజులకే సీఎం ఆఫీసు నుంచి ఆయనకు ఫోన్ వెళ్లింది. రాష్ట్రంలోని రెండో అతిపెద్దదైన భువనగిరి మార్కెట్ కమిటీకి ఆయన్ను చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అతడి పేరే పంతులు నాయక్.
పంతులు నాయక్ అనే డ్రైవరే కాదు; ఒక వాల్ పెయింటర్, ఒక విద్యార్థి, ఒక డెయిరీ వ్యాపారి, ఒక ఆటో డ్రైవర్, ఒక అడ్వకేటు, ఒక మాజీ నక్సలైటు, ఒక గృహిణి, ఒక ప్రొఫెసర్, ఒక టీచర్, ఒక జర్నలిస్టు… ఉద్యమంలో పాల్గొన్న ఎందరో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు.
వస్తుందో రాదో అని అనుక్షణం భయపెట్టి, చిట్టచివరకు సాకారమైన తెలంగాణ రాష్ర్టానికి నేటికి ఏడేండ్ల్లు. ఆశ నిరాశల మధ్య లోలకంలా సాగిన ఉద్యమంలో సబ్బండ వర్ణాలు సమరోత్సాహంతో పాల్గొన్నాయి. తనకేం జరుగుతుందో అని ఎవరూ భయపడలేదు. తనకేం ఒరుగుతుందని ఏ ఒక్కరూ అనుకోలేదు. ఆస్తుల కోసం వెంపర్లాడలేదు. అవకాశాల కోసం వెంట పడలేదు. పదవుల కోసం పరితపించలేదు. తెలంగాణ గెలిస్తే తను నిలిచినట్టేనన్నది అందరి నమ్మకం. వారి నమ్మకానికి నిలువెత్తు ఆధారం కేసీఆర్. తనను నమ్మినవారినే ఆయన నమ్ముకున్నారు. తనతో పోరుబాటలో నడిచిన అనేకమందిని.. తల్లి కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు రెక్కల కింద దాచుకున్నారు. నాటి సామాన్యులు అనేకమందిని కేసీఆర్.. నేడు అసామాన్యులుగా, రాష్ట్ర నేతలుగా తీర్చిదిద్దారు. తన ఆపార అనుభవంతో కొత్త రాష్ర్టానికి యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు. కులం లేదు.. మతం లేదు.. తన వెంట నడిచినవారే నాయకులు. లెక్కకు వేళ్లు చాలవు. వందలు.. వేలు.. ఎందరి పేర్లని రాయగలం! తెలంగాణ ఆవిర్భవించి ఏడేండ్లయిన నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో నాయకులుగా ఎదిగిన, పదవులకు వన్నె తెస్తున్న కొందరిని మరోమారు స్ఫురణకు తెస్తూ ‘నమస్తే తెలంగాణ’ చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో ఓరుగంటి సతీశ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఎక్కడో కారు నడుపుకుంటూ బతుకును వెల్లమారుస్తున్న ఓ డ్రైవర్.. ఒక లక్ష్యం కోసం పడిన అడుగుల వెంట అన్నీ వదిలేసి నడిచాడు.గోడలమీద బొమ్మలు వేసుకొనే ఓ చిత్రకారుడు.. ఆ లక్ష్య సాధనలో తానూ మమేకమవుతానంటూ కదిలివచ్చాడు.. ఒక సామాన్య న్యాయవాది.. కడుపు కట్టుకొని తెలంగాణ ఉద్యమ బరిలోకి దూకాడు. తమ భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయంలో చదువుకొంటున్న విద్యార్థులు.. విచ్చుకత్తుల్లా ఎగిసిపడ్డారు..
–ఓరుగంటి సతీశ్
చుట్టూ ముప్పిరిగొన్న శత్రుమూకలు.. మధ్యలో ఒకే ఒక్క బక్కపలుచని నాయకుడు.. ఆయన్ని నిలువరించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న వైరివర్గం.. గెలుస్తాడో లేదో తెలియదు. కానీ వెరపులేని ఆయన కండ్లల్లో తానే గెలుస్తానన్న మొక్కవోని ధైర్యం.. తడబాటులేని ఆయన మాటల్లో విజయం తథ్యమన్న ధీమా.. అప్పటిదాకా బిక్కుబిక్కుమంటున్న సమాజాన్ని తట్టిలేపింది. ఒక్కొక్కరిని ఒక్కో తురుపుముక్కలా మార్చి.. వైరి చక్రాన్ని అధిగమించి తన వెంట నడిపించారు. వీళ్లెవ్వరూ డబ్బూ దస్కం ఉన్నవాళ్లేం కాదు. బలం బలగం ఉన్నవాళ్లూ కారు. వీరి నేపథ్యమల్లా తెలంగాణ ఉద్యమమే. వీరి లక్ష్యం తెలంగాణ సాధనే. అందుకోసం తమ నాయకుడు ఏం చేయమన్నా చేయడమే కర్తవ్యంగా ముందుకు సాగినవారు. తన ప్రజలకోసం పల్లేరుకాయల మీద నడిచిన ఉద్యమనేత.. విజయ తెలంగాణ సాధించిన తర్వాత.. తన వెంట నడిచిన ఏ ఒక్కరినీ విస్మరించలేదు.. ప్రతి ఒక్కరినీ తనతోపాటు పరిపాలనలో భాగస్వాములను చేశాడు. బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యతలను వారి భుజస్కంధాలపైనే ఉంచాడు. ఆ నాయకుడి నమ్మకం వమ్ముకాలేదు.. ఆ లక్ష్యం సిద్ధించింది. అందరం కలిసి తెలంగాణ సాధించుకొన్నాం.. ఇక అంతా కలిసి బంగారు తెలంగాణను సాకారం చేసుకొందాం. ఇదీ ఆయన లక్ష్యం. నాడు ఉద్యమంలో వారంతా ఆయన అడుగులో అడుగువేశారు. నేడు పుత్తడి తెలంగాణ కల సాకారం కోసం ఆయన ఆలోచనల వెంట నడుస్తున్నారు. ఇది తెలంగాణలో మాత్రమే సాధ్యమైన అద్భుతం. సీఎం కేసీఆర్ శిఖరాయమానమైన ఔన్నత్యానికి నిదర్శనం.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ ఇలా సామాన్యులే. కానీ.. ఉద్యమంలో వారి చైతన్యాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. ఏడేండ్ల క్రితం వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించడంతోపాటు గెలుపొందిన వెంటనే మంత్రులను చేసి గౌరవించారు. కేసీఆర్ క్యాబినెట్లో, తెలంగాణ ప్రభుత్వంలో, శాసనసభలో, మండలిలో, కార్పొరేషన్లలో వివిధ పదవుల్లో ఉన్నవారంతా ఏడేండ్ల క్రితం వరకు అత్యంత సామాన్యులే. ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారే. వారికి గుర్తింపునిచ్చి.. ప్రభుత్వంలో, పరిపాలనలో
భాగస్వాములను చేసిన గొప్ప మనసు సీఎం కేసీఆర్ది.
2001 ముందు సాధారణ న్యాయవాదిగా ఉన్న జీ జగదీశ్రెడ్డి.. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన క్షణం పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ అడుగుజాడల్లో నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగకుండా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆయనకు రెండుసార్లు మంత్రి పదవిని అందించారు. అత్యంత కీలకమైన విద్యుత్శాఖను అప్పగించారు.
పంతులు నాయక్.. సాధారణమైన డ్రైవరు. బతుకుదెరువు కోసం భార్యతో కలిసి ఎర్రమంజిల్లోని ఎమ్మెల్యే క్వార్టర్లలో పనిచేసేవారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వద్ద డ్రైవరుగా, భార్య అక్కడే ఉండే ఎమ్మెల్యేల ఇండ్లలో పనిచేస్తుండె. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. నిత్యం కేసీఆర్ నివాసానికి ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేవారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెడ్తా అనగానే డ్రైవరు ఉద్యోగం వదిలి కేసీఆర్తో కలిసి వచ్చాడు. తొలుత పంతులునాయక్ తనతో కలిసి వస్తున్న విషయాన్ని ఉద్యమనేత కేసీఆర్ గమనించలేదు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన పాదయాత్రలో పంతులునాయక్ను గమనించిన కేసీఆర్ ఆశ్చర్యపోయారు. అత్యంత నిరుపేద పంతులునాయక్ తనతో రావడం చూసి ‘పనిచేసుకో.. చిన్న జీవితం.. చిన్న జీతం కదా.. ఎందుకు నాతో వస్తున్నావు? భార్యాపిల్లల పోషణ ఎట్లా?’ అని అడిగారు. నా భార్య ఇండ్లల్లో పనిచేసుకొంటుంది. పిల్లలను పెంచుకుంటాం. మీతో తెలంగాణ కోసం నేను కూడా తిరుగుతా. మీతోనే ఉంటా’ అని చెప్పిండు.
2001 నుంచి ఇప్పటివరకు పంతులు నాయక్ ఏమీ ఆశించకుండానే టీఆర్ఎస్తో, కేసీఆర్తో కల్సి నడిచిండు. ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ను ఆయన జన్మదినం సందర్భంగా కలిసేందుకు వెళ్లాడు. చాలామంది అప్పటికే కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. క్యూలైన్లో ఉన్నారు. పంతులునాయక్ కూడా క్యూలో ఉన్నారు. కొద్దిసేపటికే ఉద్యమసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పంతులునాయక్ను పలకరించడంతోపాటు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ‘మన రాష్ట్రం మనకు వచ్చింది.. మన శ్రమ వృథా కాలేదు. నువ్వు ప్రభుత్వంలో భాగం కావాలి’ అని అన్నారు. ఇది జరిగిన కొంతకాలానికి ప్రగతిభవన్ నుంచి పంతులునాయక్కు ఫోన్ వెళ్లింది. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద మార్కెట్ కమిటీగా ఉన్న భువనగిరి మార్కెట్ కమిటీకి ఆయన్ను చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయానికి స్థానిక నేతలు, అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంటే ఆషామాషీ కాదు. అప్పటివరకు గత పాలకుల హయాంలో ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కోట్లు తీసుకొని కట్టబెట్టిన ఘటనలున్నాయి. కానీ, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఉద్యమాన్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన ఒక అత్యంత సాధారణమైన వ్యక్తిని ఉన్నత పదవినిచ్చి గౌరవించడం ఒక్క కేసీఆర్ సారుకే.. టీఆర్ఎస్లోనే సాధ్యమయ్యింది.
సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించిన వెంటనే ఆయన వెన్నంటి నడవాలని నిరంజన్రెడ్డి నిశ్చయించుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి నిరంజన్రెడ్డి ఓడిపోయినప్పటికీ ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కావాల్సిందేనని పట్టుబట్టి మరీ ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి క్యాబినెట్ సమావేశాలకు శాశ్వత ప్రత్యేక అతిథిగా పిలిపించారు కేసీఆర్. 2018లో ఎమ్మెల్యేగా గెలవడంతో వ్యవసాయశాఖను అప్పగించారు.
మహమూద్ అలీ.. సాధారణ డెయిరీ వ్యాపారి. పెద్దగా రాజకీయాలు తెలిసిన నాయకుడేం కాదు. బలం బలగం ఉన్నవాడేం కాదు. కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో టీఆర్ఎస్ కార్యకర్తగా అత్యంత నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. ఉద్యమసారథి ఎక్కడికి వెళ్లినా.. ఏ సభకు హాజరైనా.. వాటికి హాజరై ఉద్యమానికి ఊపిరులందించిన వ్యక్తి. పార్టీలో అత్యంత సాధారణ కార్యకర్తగా పనిచేసిన మహమూద్ అలీని సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఎమ్మెల్సీని చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తన తొలి క్యాబినెట్లోనే రెవెన్యూ శాఖకు మంత్రిని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండోసారి మంత్రిమండలిలోనూ మహమూద్ అలీకి పెద్దపీట వేశారు. ఈసారి ఏకంగా హోం వ్యవహారాలను ఆయనకు అప్పగించి పార్టీ కార్యకర్తల పట్ల తనకున్న అభిమానాన్ని కేసీఆర్ మరోసారి నిలబెట్టుకొన్నారు..
దళితుడైన కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ తానుగా మలచుకొన్న ఉద్యమనాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, చీఫ్విప్ కావడంతోపాటు.. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా చేపట్టారు. టీఆర్ఎస్లోనే కొప్పుల ఈశ్వర్ కార్యకర్త స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారు. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో కొప్పుల ఈశ్వర్ కూడా ఒకరు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగవర్గానిది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడాయి. ఇందులో గెజిటెడ్ అధికారుల నాయకుడిగా శ్రీనివాస్గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. శ్రీనివాస్గౌడ్ను రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మంత్రులకు సరిసమానమైన పార్లమెంటరీ సెక్రటరీ పదవిని అందించారు. ఆ తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత మంత్రినిచేశారు.
పసునూరి దయాకర్. దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన లోక్సభ సభ్యుల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఒకరు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టా అందుకొన్న దయాకర్ తొలినాళ్లలో ఆర్టిస్టుగా వాల్పెయింటింగ్లు వేసేవారు.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మొదలుపెట్టడంతో ఆయనతో కలిసి నడిచారు. తన ప్రతిభతో రాష్ట్ర సాధనకోసం వాల్పెయింటింగ్స్ గీసేవారు. తెలంగాణ తల్లి విగ్రహాలను తయారుచేసి ఊరూరా ప్రతిష్ఠించేందుకు పంపించేవారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఆయన.. తన సామాజికవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. కేసీఆర్ వెంటనే ఉంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ‘నేను సైతం’ అని పాల్గొన్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పసునూరి దయాకర్ను వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్గా, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. తర్వాత ఏకంగా వరంగల్ లోక్సభ స్థానం నుంచి పార్టీ టిక్కెట్ ఇచ్చారు. రెండోసారి అభ్యర్థిని మార్చకుండా అదేస్థానంలో మళ్లీ దయాకర్కే టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న దయాకర్ను జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న నేతగా మలిచింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసినవారిని గుర్తించడం, వారికి సముచిత పదవి ఇవ్వడం ఒక్క టీఆర్ఎస్లోనే సాధ్యమనడానికి దయాకర్ నిలువెత్తు నిదర్శనం. ఇతర రాజకీయ పార్టీల్లో ఎంపీగా అవకాశం రావడమే గగనకుసుమం. అలాంటిది కేసీఆర్ సాహసం చేశారు. దయాకర్ను ఎన్నికల్లో నిలబెట్టి చేతులు దులుపుకోలేదు.. ఓడిపోయే సీటు ఇచ్చి మమ అనిపించలేదు. వరంగల్లో దయాకర్ను గెలిపించడానికి తానే పోటీచేస్తున్నట్టుగా కేసీఆర్ పనిచేశారు. అందుకే రికార్డు మెజార్టీతో విజయం సాధ్యమైంది.
రాష్ట్రంలో ఇప్పుడున్న చాలామంది యువనేతలకు అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయే. బాల్కసుమన్, గ్యాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, చిరుమళ్ల రాకేశ్, వాసుదేవరెడ్డి, పిడమర్తి రవి, బాబా ఫసియుద్దీన్, విద్యాసాగర్ ఇలా ఒక్కరేమిటి.. విద్యార్థులకు దిక్సూచిగా నిలిచి.. వేలుపట్టుకొని ఉద్యమాలవైపు నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో కీలక నేతలుగా ఉన్న వీరు టీఆర్ఎస్ చెట్టునీడలోనే ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వీరు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కదిలిరావాలన్న ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో రణస్థలిలో దూకారు. ఒక వైపు చదువుకొంటూనే.. మరోవైపు ఉద్యమంలో భాగమయ్యేలా కేసీఆర్ నాడు జాగ్రత్తపడ్డారు. వారి చదువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొన్నారు.
విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్న బాల్క సుమన్కు ఎవరూ ఊహించని విధంగా పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని కేటాయించి ఎంపీగా గెలిపించిన చరిత్ర సీఎం కేసీఆర్ది. ఆనాడు రాష్ట్రంలో అత్యంత బలమైన నేతగా ఉన్న జీ వెంకటస్వామి కుమారుడు వివేక్ (అప్పటి సిట్టింగ్ ఎంపీ కూడా)పై బాల్క సుమన్ సంచలన విజయం సాధించారు. దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన విద్యార్థి నేతగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన సుమన్ను శాసనసభలో విప్గా నియమించారు కేసీఆర్.
మరో విద్యార్థి నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ను కీలకమైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు తొలి చైర్మన్గా నియమించారు. ఇదేవిధంగా తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న చాలామందిని గుర్తించి వారికి సముచిత స్థానం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీ, ఎస్టీ కమిషన్లో సభ్యుడిగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన వ్యక్తే.
ఆయన టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేశారు. ఆయనను కూడా సీఎం కేసీఆర్.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే పార్లమెంటరీ సెక్రటరీ పోస్టును కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. రెండోసారి 2018లో కూడా కేసీఆరే స్వయంగా కిశోర్కు మరో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు.
ప్రత్యేక తెలంగాణలో హైదరాబాద్ తొలిమేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణించారు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీలోని అనేక కమిటీల్లో సభ్యుడిగా కూడా రామ్మోహన్ వ్యవహరించారు. రామ్మోహన్ను రాటుదేల్చి పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆరే. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసియుద్దీన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పిడమర్తి రవి, టీఎస్టీఎస్ చైర్మన్గా పనిచేసిన చిరుమళ్ల రాకేశ్తోపాటు కాకతీయ విద్యార్థి జేఏసీ చైర్మన్గా పనిచేసిన వాసుదేవరెడ్డికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు కేసీఆర్. విశేషమేమిటంటే వీరంతా గతంలో ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారే. టీఆర్ఎస్ నీడలోనే రాష్ట్రస్థాయికి ఎదిగిన నేతలు వీరు.
టీఆర్ఎస్ తెలంగాణలో మహిళా నాయకురాళ్లను కూడా తయారుచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో మహిళలకు అనేక అవకాశాలు ఇచ్చి వారిని గెలిపించారు. ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఒకప్పుడు సాధారణ గృహిణి. భర్త దేవేందర్రెడ్డి న్యాయవాది కావడంతో తాను కూడా ఎల్ఎల్బీ పూర్తిచేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్.. పద్మాదేవేందర్రెడ్డికి తొలుత రామాయంపేట జడ్పీటీసీగా 2001లో అవకాశం ఇచ్చారు. తర్వాత అదే శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2004లో గెలిపించారు. 2014లో శాసనసభకు డిప్యూటీ స్పీకర్గా కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కేసీఆర్ రాజకీయ ప్రోత్సాహం, టీఆర్ఎస్ అండతో ఆమె ఇప్పుడు రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. ఆలేరు ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కూడా ఇదే తరహాలో ఎదిగారు. ఆమె 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. అనంతరం ఎంపీపీగా పనిచేశారు. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే అయిన ఆమెకు విప్గా అవకాశం ఇచ్చారు.
2001 నుంచి నేటి వరకు దాదాపు ప్రతి సందర్భంలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులను పార్టీలో, ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూనే ఉన్నారు. 2001లో పార్టీ మొదలయిన తర్వాత సోలిపేట రామలింగారెడ్డికి 2004 ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే, ఆర్ సత్యనారాయణను ఎమ్మెల్సీగా గెలిపించారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని చేశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లాల ఓదెలు కూడా పూర్వాశ్రమంలో జర్నలిస్టే. 2018 ఎన్నికల్లో అందోల్ ఎమ్మెల్యేగా జర్నలిస్టు చంటి క్రాంతికిరణ్ను గెలిపించారు. వీరంతా అతి సామాన్య గ్రామీణ విలేకరుల నేపథ్యం ఉన్నవారు. తెలంగాణ సోయి ఉన్నవాళ్లు. కేసీఆర్ బాటలో నడిచినవాళ్లే. టీఆర్ఎస్ పార్టీ వార్తలను కవర్చేసే క్రాంతి వంటివారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి, గెలిపించడానికి అవసరమైన రాజకీయ వ్యూహాన్ని కూడా కేసీఆరే సమకూర్చడం విశేషం. తెలంగాణ కోసం తెలంగాణ సోయి ఉన్నవాళ్లు ఉండాలని కేసీఆర్ చెప్తుంటారు. జర్నలిస్టులకు ఆ సోయి ఉంటుందనే ప్రతి ఎన్నికల్లో ఒకరికో, ఇద్దరికో టిక్కెట్లు ఇస్తూనే ఉన్నారు.
టీఆర్ఎస్ నుంచి వెలుగులోకి వచ్చిన మరో నేత రసమయి బాలకిషన్. మానకొండూరు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఎన్నికైన ఆయన.. పూర్వాశ్రమంలో ఒక ఉపాధ్యాయుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్తో ఆయన కలిసి నడిచారు. టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన కళాకారుల బృందానికి నాయకుడిగా ఎదిగారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా ఉంటూనే మరోవైపు కేసీఆర్తో పనిచేశారు. టీఆర్ఎస్ ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమంలో రసమయి బాలకిషన్ పాట తప్పనిసరిగా ఉండేది. టీఆర్ఎస్ సభల ద్వారా మంచి గాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే కళాకారులతో ప్రత్యేకంగా ‘సాంస్కృతిక సారథి’ ఏర్పాటుచేశారు. దీనికి బాలకిషన్ సారథ్యం వహించారు.
అరగుండు, అరమీసంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గాంధీనాయక్ గుర్తున్నారా? తెలంగాణలో ఎక్కడ ఏ ఆందోళన జరిగినా.. ఎక్కడకేసీఆర్ సారు సభ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత జనగామ జిల్లా) మొండ్రాయి గ్రామం ఆయనది.ఆటోడ్రైవర్గా పని చేసుకునేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా అరగుండు, అరమీసంతోనిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. తెలంగాణ సిద్ధించిన వెంటనే కేసీఆర్ ఆయనను పిలిపించి తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థకు(జీసీసీ)కి తొలి చైర్మన్గా నియమించారు. గిరిజన బిడ్డ గాంధీనాయక్ చేతిలో మొత్తం సహకార సంస్థను పెట్టి పాలనలో భాగస్వామిని చేశారు.తెలంగాణ రావడంతోనే తనకు ఈ పదవి వచ్చిందని, జీవితాంతం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటానని గాంధీనాయక్ అనేక సందర్భాల్లోచెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తనతోపాటు నడిచిన చాలామందికి చాలా అవకాశాలు వచ్చాయి. విద్యారంగంలో పనిచేస్తున్నవారికి కూడా తెలంగాణ రావడంతో పదవులు వచ్చాయి. మహబూబాబాద్ ఎంపీగా.. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారాంనాయక్కు సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే సీతారాంనాయక్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని చైర్మన్ను చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ ఎవరూ చేయనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రొఫెసర్ను తీసుకువచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా నియమించి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగేలా చేసింది. ఉన్నత విద్యామండలికి కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పాపిరెడ్డిని చైర్మన్ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సుమిత్రా ఆనంద్ కూడా ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినవారే.
ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్న పలువురు తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నత స్థానాలను అధిరోహించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వీ శ్రీనివాస్గౌడ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే టీఎన్జీవో నేతగా ఉద్యమంలో నడిచిన స్వామిగౌడ్ను రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్గా చేశారు సీఎం కేసీఆర్. మరో ఉద్యమనేత దేవీప్రసాద్ను బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత సీ విఠల్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించారు. ఒకరినో ఇద్దరినో కాదు.. పదుల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలనేతలు పాలనలో నేరుగా పాలుపంచుకొనేలా చేశారు.
కేసీఆర్తో కలిసి నడిచిన వారిలో వందల మంది ఇప్పుడు రాష్ట్రంలో అనేక క్రియాశీల స్థానాల్లో ఉన్నారు. ఒకనాడు పీపుల్స్వార్ అగ్రనాయకుడిగా ఉండి ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డ నారదాసు లక్ష్మణరావు కూడా టీఆర్ఎస్ నీడలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. విద్యుత్చార్జీల పెంపునకు నిరసనగా కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాసిన సందర్భంలో ఆయనకు సంఘీభావంగా నిలిచారు. అప్పట్నుంచీ కేసీఆర్ వెంటే నడిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే టీఆర్ఎస్ చెట్టు నీడన ఎదిగినవారు రాష్ట్రంలో వందలమంది ఉన్నారనడంలో సందేహంలేదు.
తనతోపాటు మొదటినుంచీ కలిసి నడిచినవారిని కనిపెట్టుకుని ఉండటమేకాదు.. మొదటి నుంచీ తెలంగాణ సోయి ఉండి, ఉద్యమ వారసత్వం ఉన్నవారికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప గౌరవం కల్పించారు. జర్నలిస్టుగా ఉండి.. తెలంగాణ అరిగోసను అక్షరీకరించిన అల్లం నారాయణకు ఏకంగా ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గొంతుకగా భాసిల్లిన, తెలంగాణ గోసలను పాడిన వాగ్గేయకారుడిగా ప్రముఖుడైన గోరటి వెంకన్న కృషికి గుర్తింపుగా ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. తెలంగాణ తేజం.. మన ఠీవి.. మన పీవీని స్మరించుకుంటూ ఆయన గౌరవర్థాం ఆయన బిడ్డ, నిత్యం తెలంగాణ గురించి ఆలోచించే ఎస్ వాణీదేవిని బరిలో దింపి మరీ గెలిపించారు సీఎం కేసీఆర్. దేశంలోని మరే ఇతర ప్రాంతీయ పార్టీల్లో ఈ తరహా నాయకత్వం కనిపించదు. రాజ్యసభ సభ్యత్వాలను, ఎమ్మెల్సీ పదవులను కూడా అతిసామాన్యులకు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్తోనే సాధ్యమయ్యింది.