KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టమంటడు. రైతులను చెప్పుతో కొడుతరా? నేను ఇదివరకే చెప్పాను. రైతులకు చెప్పులు ఉంటయ్. బందోబస్త్గా ఉంటయ్. వాళ్లకు తిక్కరేగి మర్రేస్తే మీ గతి ఏమైతదని ఆలోచించుకోమని చెప్పాను. సిరిసిల్లలో కార్మికులు చనిపోయే పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యేటట్టున్నయ్ అంటే.. ఇంకో కాంగ్రెసోడు.. ఏం పోయింది వాళ్లను నిరోధ్లు, పాపడాలు అమ్ముకొమ్మని బతుకమ్మంటున్నడు. నిరోధ్లు అమ్ముకొని బతుకాలారా? కుక్కల కొడుకుల్లారా? మీరు మనుషులా? లక్షలాదిగా ఉండే చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఇస్తే ఇచ్చారు.. చేతగాకపోతే ఇవ్వకండి గానీ.. నిరోధ్లు అమ్ముకొని, పాపడాలు అమ్ముకొని బతుకుమంటే మనుషుల్లా కనిపిస్తలేరా? చేనేత కార్మికులే పులులై గర్జించి మిమ్మల్ని తరిమికొడుతరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా’నన్నారు.
‘బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫారాలు బిల్లులన్నీ విడుదల చేయాలి. చేనేత కార్మికులకు నేను చెప్పాను. పార్టీ నుంచి వకీళ్ల ఫీజులు చెల్లిస్తాం. ప్రభుత్వాన్ని కోర్టుకు గుంజుదాం.. మీరు భయపడాల్సింది లేదు. కొట్లాడుదామని చెప్పాం. రేపు ధర్నా తర్వాత స్పందించకపోతే.. ఆర్డర్లు రాకపోతే ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం. ప్రతి ఊరిలో ధర్నాలు పెడుతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలు ఉన్నయో.. రాష్ట్రాన్ని రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుతాం.. మిమ్మల్ని వదిలిపెట్టం బిడ్డా జాగ్రత్త. మా వినోద్ పెద్ద అడ్వకేట్. ఈయనే కేసు వేయాలి. వినోద్ మీరే కేసు వేయండి. ఇంకా ఏం మాట్లాడుతున్నరు. చేనేత కార్మికులు మొన్నటి దాకా దొబ్బి తిన్నరట. దొబ్బితిన్నారంటారా దొంగనా కొడుకుల్లారా? దొబ్బితిన్నారంటా?. కార్మికులు కష్టం చేశారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తే నేసి ప్రజలకు పంపారు. ఏం లేని అవ్వలకు, అక్కా చెల్లల్లకు బతుకమ్మ చీరలు వెళ్లాయి. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకగా వెళ్లాయి. కార్మికులు బతికారు.. పేదల ప్రజలకు అందాయి. కార్మికులకో ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ పదేళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికులు బతుకు ఏముండెనో.. మళ్లీ చేనేత కార్మికులకు ఆ పరిస్థితిని ఈ గవర్నమెంట్ తీసుకువచ్చింది. మూడు నాలుగు నెలల్లో ఇంత పెద్ద కథ’ అన్నారు.
‘నాకు ఇంకో విషయం అర్థం కావడం లేదు. మొన్న సూర్యాపేటలో అడిగిన. కొత్తగా పీకి పడగొట్టింది ఏమీ లేదు. మీతోని ఏం కాదు. మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడ్డమైన మాటలు మాట్లాడి 1.8ఓట్లు ఎక్కువ వచ్చి గెలిచారు. మేం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37శాతం ఓట్లు వచ్చాయి.. మీకు 38.8 ఓట్లు వచ్చాయి. 1.8 ఓట్లు ఎక్కువ లత్కోర్ వాగ్ధానాలతో వచ్చాయి. ఉల్టా, సీదా వాగ్ధానాలతో.. తులం బంగారానికి కొందరు.. రూ.12లక్షల దళితబంధు వస్తది కొందరు.. రూ.4వేల పెన్షన్ వస్తదని కొందరు మోసపోయారు. రూ.2లక్షల రుణమాఫీకి కొందరు మోసపోయారు. రూ.500 బోనస్ ఇస్తరని కొందరు మోసపోయారు. మహిళలకు స్కూటీ ఇస్తమని చెప్పడంతో కొందరు మోసపోయారు. బిడ్డా వారే మీకు కర్రుకాచి వాతపెడుతరు’ అంటూ మండిపడ్డారు.