KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబై లారీలు దాటుకుంట వచ్చిన. అందులో ఫుల్గా మంది ఉన్నరు. చాలాదూరంలో పోలీసులు ఆపుతున్నరు. పోలీసోళ్లు బొమ్మలు పీకేస్తున్నరు. పోలీసుల మిత్రులకు మనవి చేస్తున్నా.. మీ డ్యూటీ మీరు చేయండి. పదేళ్లు మేం గవర్నమెంట్లో ఉన్నం. అమాయకులను బెదిరించడం, కొట్టడం.. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పీకేయడం ఇదా మీ డ్యూటీ? ఇవాళ మేం కూడా లెక్కబెడుతున్నాం. నేను పోలీస్ పేరెత్తంగనే ప్రజలు ఎలా స్పందిస్తున్నరో మీరు చూస్తున్నరు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి. జాగ్రత్త మళ్లీ గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకోవాలి. పదేళ్లు నేను ముఖ్యమంత్రిగనే ఉన్న. ఒక్కరోజన్నా దౌర్జన్యం చేసినమా? ఎవరినైనా వేధించామా? మరి వాళ ఎందుకు పోలీసులు మితిమీరిన పనులు చేస్తున్నరు. పోలీసులు దయచేసి మానుకోండి’ అని హితవు పలికారు.
‘మేం అన్నీ రికార్డు చేస్తున్నాం. ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీసీపీగారు మీరు మారాలని చెబుతున్నా. లేకపోతే ప్రజలే మీ మీదకు తిరుగుబాటకు వస్తారు జాగ్రత్త. మా కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు చల్వాజీ మాధవరావు అని పెద్దపల్లి జిల్లా ధర్మారంలో సోషల్ మీడియాలో పోస్టుపెట్టాడని అక్రమంగా కేసులు పెట్టి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే.. ఆ చల్వాజీ మాధవరావుపై ఏదైతే జరిగిందో దానిపై స్పెషల్ కమిటీ.. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జాన్యానికి పాల్పడ్డడో వాళ్లపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్తా.. లేకపోతే మేం న్యాయస్థానం తలుపులు తడుతమని మనవి చేస్తున్నా. మేం కూడా మస్త్గా చూసినం. నేను కేంద్రమంత్రిగా, రాష్ట్రమంత్రిగా పని చేశాను. ఇదే జిల్లాలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగ ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నా దౌర్జన్యాలు చేయించలేదు. రాజకీయాలు చేసే వారు చేస్తారు. అనవసరంగా మీకు రాజకీయాలు వద్దు’ అంటూ సూచించారు.