నిజామాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్కు రానున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు.
బుధవారం ఉదయం 9.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఉద యం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.40 గంటలకు బాన్సువాడలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో బయలుదేరి ఉదయం 10.55 గంటలకు తిమ్మాపూర్లోని తిరుమల వేంకటేశ్వర ఆలయానికి చేరుకుంటారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న కృతజ్ఞత సభలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్కు హెలికాప్టర్లో పయనమవుతారు.
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. బాన్సువాడ పట్టణంతోపాటు ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కృతజ్ఞత సభ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికను సిద్ధం చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.