హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సీ-ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి మరోసారి అధికారం కట్టబెట్టనున్నాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ నాయకుడిగా అవతరిస్తున్నారని అన్నా రు. దక్షిణాది నుంచి హిందీ ధారాళంగా మాట్లాడే నేత కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. మోజో టీవీ ‘జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం’ అనే అంశంపై శుక్రవారం చర్చ నిర్వహించింది. మోజో టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ బర్ఖా దత్ నిర్వహించిన చర్చాగోష్టిలో యశ్వంత్ దేశ్ముఖ్తోపాటు సీనియర్ జర్నలిస్టు రాధిక రామశేషన్, రాజకీయ విశ్లేషకుడు పీకేడీ నంబియార్, దక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి, టీఆర్ఎస్ నేత క్రిశాంక్ మన్నె పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ దేశ్ముఖ్ మాట్లాడుతూ… గతంలో దక్షిణాది నుంచి పీవీ నరసింహారావు అద్భుతంగా హిందీ మాట్లాడేవారని, ఆ తర్వాత కేసీఆర్ మాత్రమే హిందీలో ధారాళంగా మాట్లాడగలరని చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ పదవులతో సంతృప్తితో ఉన్నారని, వాళ్లు దేశ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ హాట్రిక్ విక్టరీతో చరిత్ర సృష్టించడం ఖాయమని యశ్వంత్ దేశ్ముఖ్ విశ్లేషించారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావటం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథలు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లాయని, అవే ఆయనను మరోసారి సీఎంను చేస్తాయని తెలిపారు. క్రిశాంక్ మన్నె మాట్లాడుతూ.. నరేంద్రమోదీ గుజరాత్ మాడల్ను చూపించి దేశ రాజకీయాలను ప్రభావితం చేశారని, కానీ ప్రస్తుతం గుజరాత్ ఏ పరిస్థితిలో ఉన్నదో దేశమంతా చూస్తున్నదని అన్నారు. గుజరాత్లో కరెంట్ కోతలతో చీకట్లు అలుముకున్నాయని, తాగునీటి కోసం మహిళలు బిందెలతో కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మాడల్గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని పేర్కొన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. కశ్మీర్లో మత రాజకీయం, పంజాబ్లో ఖలిస్థానీ, ఉత్తరప్రదేశ్లో మందిర్ – మసీదు, మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్, కర్ణాటకలో బుర్ఖా, దిల్లీలో బుల్డోజర్, తెలంగాణలో ఉర్దూ.. ఇలా అన్నిచోట్లా విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
కేసీఆర్ దిల్లీ వెళ్లి కేజ్రీవాల్ను అభినందించారని, మరో ముఖ్యమంత్రి చేసే మంచిని పొగిడే గొప్ప మనసు కేసీఆర్ది అని క్రిశాంక్ అన్నారు. కానీ బీజేపీ నేతలకు అంతటి పరిణతి లేదని ఎద్దేవాచేశారు. మోదీ హైదరాబాద్ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడి వెళ్లిపోయారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తన స్థాయిని మరిచి మాట్లాడారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేద, కనీసం మరో రెండేండ్లయినా ఏం చేస్తామనేది చెప్తే బాగుండేదని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. 2014, 2018లో కూడా బీజేపీ ఇలాంటి ప్రకటనలే చేసిందని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని మూటగట్టుకొన్నదని తెలిపారు. తెలంగాణ మొత్తాన్ని ప్రభావితం చేసే ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్సీ కూడా దక్కించుకోలేకపోయిందని, చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆ పార్టీ పోగొట్టుకున్నదని గుర్తుచేశారు. తెలంగాణ టీఆర్ఎస్తో మమేకమై పోయిందని, ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు.
దేశాన్ని ప్రభావితం చేసే నేతలంగా కేసీఆర్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని క్రిశాంక్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని వాళ్లంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి ఎందరో నేతలు కేసీఆర్తో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ రాజకీయం చేయడానికి దేశమంతా పర్యటించడం లేదని, కేవలం దేశ గతిని మార్చేందుకే అందరినీ కలుస్తున్నారని తెలిపారు. తమిళనాడు స్టార్ హీరో విజయ్ కేసీఆర్ వద్దకు వచ్చి కలిశారని, ఇలా ఎందరో కలిసినా కేసీఆర్ ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడలేదని పేర్కొన్నారు. కేవలం దేశానికి ఉపయోగపడే అంశాల గురించే మాట్లాడుతారని చెప్పారు.